న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొత్త డేటా రిలీజైంది. 2020 సంవత్సరంలో సైబర్ క్రైమ్ 11 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ డేటాను హోమ్ కమిటీకి అందజేసింది. దాని ప్రకారం.. 2017లో ఇండియాలో 21,796 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. 2018లో 27,248 కేసులు, 2019లో 44735 కేసులు, 2020లో 50035 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. 2019తో పోలిస్తే 2020లో క్రైమ్ రేటు 11 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ దాడులు జరుగుతున్న తీరు పట్ల హోమ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, రాజస్థాన్, గోవాలో అసలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు లేవని తెలిసింది. ఇక ఏపీ, కర్నాటక, యూపీల్లో కేవలం ఒకటి లేదా రెండు స్టేషన్లు మాత్రమే ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. అయితే అన్ని జిల్లాల్లో సైబర్ సెల్స్ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు హోమ్ కమిటీ తెలిపింది. సైబర్ నేరాలను అదుపు చేసేందుకు సైబర్ క్రైమ్ హాట్స్పాట్లను ఆయా రాష్ట్రాలు గుర్తించాలని రిపోర్ట్ అభిప్రాయపడింది. ఎంపీ ఆనంద్ శర్మ నేతృత్వంలో స్టాండింగ్ కమిటీ తన రిపోర్ట్ను తయారు చేసింది.