న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం నిరసన చేశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటి వద్ద ధర్నా చేస్తున్న ప్రభుత్వ గెస్ట్ టీచర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. వారి నిరసనలో సిద్ధూ కూడా పాల్గొన్నారు. గెస్ట్ ఉపాధ్యాయులతో కలిసి ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు ఫ్లకార్డులను ప్రదర్శించారు.
ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ “కాంట్రాక్ట్ మోడల్” అని, ఆప్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగం దాదాపు 5 రెట్లు పెరిగిందని సిద్ధూ ట్విట్టర్లో ఆరోపించారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ చేస్తున్న విమర్శలను ఈ మేరకు తిప్పికొట్టారు. కాగా, ఢిల్లీ గెస్ట్ ఉపాధ్యాయుల సంఘం కూడా సీఎంపై మండిపడింది. గత ఏడేళ్లుగా తమ హామీలను నెరవేర్చని అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్లో హామీలు గుప్పిస్తున్నారని విమర్శించింది.