హైదరాబాద్ : వరంగల్లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండ జిల్లా వేదికగా నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాశ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడారు. జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. జాతీయ స్థాయి క్రీడల కోసం అన్ని వసతులు కల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అవసరాన్ని గుర్తించి, అందుకనుగుణంగా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. వరంగల్ వంటి విశిష్టమైన నగరంలో క్రీడలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. క్రీడల కోసం వరంగల్లో వేదిక, స్పోర్ట్స్ విలేజీ ఉండాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ పేర్కొనగా.. మంత్రులుగా ఇందు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యతగా తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు.