సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలి
జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది
రంగారెడ్డి, జూన్ 14(నమస్తే తెలంగాణ): మైనార్టీల సంక్షేమానికి కొనసాగుతున్న కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ప్రధానమంత్రి పదిహేను సూత్రాల పథకం అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలో మైనార్టీల స్థితిగతులు, వారి జనాభా, కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరుతున్న లబ్ధికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. షాదీ ముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్హులకు డబ్బు లు మంజూరయ్యేలా చూడాలని సూచించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత శిక్షణా కేంద్రాల్లో మైనార్టీ యువతులు ఎక్కు వ సంఖ్యలో చేరేలా ప్రోత్సహించాలన్నారు.
మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని, విద్య, ఉపాధి రంగాలకు సంబంధించి మైనార్టీలకు విరివి గా రుణాలను అందించాలన్నారు. విదేశాల్లో ఉన్న త విద్యాభ్యాసంకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందిస్తున్న దృష్ట్యా ఎక్కువ మంది యు వత సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. మైనార్టీల సంక్షేమానికి సంబంధించి ఆయా శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, అధికారు లు సమర్థవంతంగా పనిచేస్తే ఎంతో మంది జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. కొవిడ్ వైరస్ ప్రభావంతో గత రెండేండ్లుగా నెమ్మదించిన కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ,
డీఈవో సుశీందర్రావు, డీఆర్డీవో ప్రభాకర్, మైనార్టీ సంక్షేమాధికారి రత్నకల్యాణి, ఆర్డీవోలు వెంకటాచారి, రాజేశ్వరి, వేణుగోపాల్ పాల్గొన్నారు.