హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్లో దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు తమిళనాడు ఎంపీ తిరుమావళవన్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తిరుమావళవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని, దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని అభినందించారు. సీఎం కేసీఆర్ను కలిసినవారిలో వివిధ రాష్ర్టాల రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిశా), సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ (ఢిల్లీ), సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్ (హర్యానా), మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్ తదితరులు ఉన్నారు.