తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను వేదికగా చేసుకొని ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే దిశగా వితండ వాదనలు చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల భావోద్వేగాలను అయోమయంలోకి నెట్టుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న కాంక్షతో ఈ వివాదాన్ని మతతత్వ మంటలతో రెచ్చగొట్టి తను చలి కాచుకోవాలనుకుంటున్నది. బీజేపీ నాయకులు హైదరాబాద్ పెరేడ్గ్రౌండ్ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై విమోచనోత్సవాలను స్వయంగా నిర్వహిస్తానని ప్రకటించడం హాస్యాస్పదం.
ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలుగా నిర్వహిస్తున్నది. గవర్నర్ మాత్రం విమోచన దినోత్సవం నిర్వహిస్తాననడం విడ్డూరం. దీని అర్థం ఏమిటి? గవర్నర్ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టది మరొకదారి అన్నట్లు బీజేపీ మాత్రం మతం, కులం, ముసుగులో రాజకీయం కోసం విమోచన పేరుతో విచ్ఛిన్నకర కుట్రలకు తెరలేపింది. అసలు సెప్టెంబర్ 17న చరిత్రలో ఏం జరిగింది? దాని ప్రాధాన్యత ఏమిటి? ఎందుకంత వివాదాస్పదమవుతున్నది?
భారత స్వాతంత్రానికి పూర్వమే హైదరాబాదు ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. బ్రిటీష్ రాణి కి అనుబంధంగా హైదరాబాదు తో సహా చాలా సంస్థానాలు ఆనాడు ఉండేవి. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే క్రమంలో ఈ సంస్థానాలకు చివరి బ్రిటీష్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ ఒక వెసులుబాటు ఇచ్చారు. దాని ప్రకారం హైదరాబాదు లాంటి రాజ్యాలు బ్రిటీష్ పాలనలో లేవు కనుక అవి స్వతంత్రంగా ఉండడమా, భారతదేశంలో లేదా పాకిస్తాన్ లో కలవడమా అనేది వారి ఇష్టం అని ప్రకటించారు. అయితే నాటి నిజాం స్వతంత్రంగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా 1947 నుండి 1948 సెప్టెంబర్ 17 దాకా హైదరాబాదు ప్రత్యేక రాజ్యంగా ఉన్నది. ఈ క్రమంలోనే నిజాం రాజు పరిపాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పటేల్ పట్వారీ భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, రజాకారులపై కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించినారు. దాన్ని అణచడం కోసం నాటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో 1948 సెప్టెంబర్ లో హైదరాబాద్పై సైనికచర్యకు దిగారు. దీంతో నిజాం రాజు సెప్టెంబర్ 17న లొంగిపోయి హైదరాబాద్ను భారత్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చరిత్ర పరిణామ క్రమాన్ని గ్రంథస్తం చేసిన అనేక రచనలు ఎక్కడా విమోచనం అనే పదాన్ని ఉపయోగించలేదు. కానీ నేటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం విమోచన అని ప్రకటించడం దుస్సాహసమైనది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని జునాగఢ్ సంస్థానం కూడా ఆనాడు భారత్లో విలీనమైంది. కానీ నేడు అక్కడ ఎలాంటి విమోచన ఉత్సవాలను కేంద్రం, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నిర్వహించడం లేదు. కానీ అదే బీజేపీ తెలంగాణలో మాత్రం విమోచన దినమని హడావిడి చేయడం దుర్మార్గం.
ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చిన సెప్టెంబర్ 17 నిజంగా జాతీయ సమైక్యతా దినం. అందుకే సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ వజ్రోత్సవాలు నాటి చారిత్ర క సందర్భాన్ని స్ఫురణకు తెస్తున్నది. అందుకే ఈ సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు కుల మత జాతి వైరుధ్యాలు లేకుండా తమ సఖ్యతను ప్రదర్శించి ఈ సమైక్యత ఉత్సవాలలో విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుందాం.
– డా.కే.వాసుదేవ రెడ్డి
95530 86666
(వ్యాసకర్త: రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్)