డాక్టర్ కావాలనుకుంది. కానీ శాస్త్రవేత్త అయింది. నాడి పట్టుకొని పరీక్షించకపోతేనేం! ఆహార భారతం నాడిని పట్టుకుంది. ఎవరేం తినాలో, ఎంత తినాలో లెక్కకట్టి వివరిస్తున్నది. పోషకాహార విలువలను పల్లెపల్లెకూ చాటిచెబుతున్నది. కొవిడ్ విలయంలోనూ పరిశోధనల్లో వెన్నుదన్నుగా నిలబడింది. జాతీయ పౌష్టికాహార సంస్థ ( National Institute of Nutrition ) డైరెక్టర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ హేమలతను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నా చిన్నప్పుడు అందరూ ‘లత డాక్టర్ అవుతుంది’ అనేవాళ్లు. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. అందుకు తగ్గట్టు కష్టపడ్డాను. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని హోలీ ఫ్యామిలీ హైస్కూల్లో చదివాను. బడికి వెళ్లే రోజుల్లోనే డాక్టర్ కోర్సు చదవడానికి వెళ్తున్నానని భావించేదాన్ని. అనుకున్నట్టే, గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటొచ్చింది. మెడిసిన్ పూర్తయ్యాక డాక్టర్ ప్రాక్టీస్ కాదనుకొని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో శాస్త్రవేత్తగా చేరాను.
శాస్త్రవేత్తగా ప్రస్థానం మొదలుపెట్టాను కానీ, మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. రోగులకు సేవ చేసే అవకాశం లేకుండాపోయిందని అనుకునేదాన్ని. ఈ పరిశోధనలు ఏమిటో అర్థమయ్యేది కాదు. క్లినికల్ వైపు వెళ్లకుండా పరిశోధన వైపు రావడంతో నా చదువుకు సార్థకత లేకుండా పోయిందని బాధపడ్డాను. అయితే, కొన్నాళ్లకే పరిశోధనలపై ఇష్టం పెరిగింది. తర్వాత ఎన్ఐఎన్ పలు దవా ఖానలతో కలిసి రోగులకు వైద్యం చేస్తున్నదని తెలిసింది. డాక్టర్గా ఈ రూపంలో సేవ చేసే అవకాశం వచ్చిందని సంతోషించాను. నిలోఫర్, గాంధీ
హాస్పిటల్స్లో పనిచేశాను. విటమిన్-ఎ లోపంతో పిల్లల కనుగుడ్లు మెత్తగా మారిపోయి నీళ్లు కారుతూ ఉండేవి. ఎముకలు పెళుసుబారి కాళ్లు వంగిపోయిన పసివాళ్లూ వచ్చేవారు. రక్తహీనతతో బాధపడుతున్న బాలలూ ఉండేవారు. అలాంటి వారిని రెండు వారాల పాటు దవాఖానలో ఉంచి పౌష్టికాహారం ఇచ్చేవాళ్లం. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తల్లులకు చెప్పేవాళ్లం. దాదాపు పన్నెండేండ్ల పాటు వేలాది చిన్నారులకు చికిత్స అందించాను. చివరి దశలో ఉన్న కంటిచూపును నిలబెట్టగలిగాను. ఓ డాక్టర్గా ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది చెప్పండి? శాస్త్రవేత్తగా సర్కారు దవాఖానలలో పనిచేయడం వల్ల డాక్టర్గా నా చదువుకు న్యాయం చేశానన్న తృప్తి కలిగింది. అదే సమయంలో ఆ వైద్యం నా పరిశోధనలకు ఎంతగానో ఉపకరించింది. పౌష్టికాహార లోపంతో పిల్లలకు కలిగే సమస్యలు, వాటి బారినపడటానికి కారణమైన సామాజిక అంశాలు అధ్యయనం చేసే అవకాశమూ వచ్చింది. గర్భిణులు, తల్లులు, పిల్లల పౌష్టికాహార సమస్యలపై పరిశోధన చేయడానికి మా బృందంతో కసి దేశంలోని ఎన్నో గ్రామాలు, ఆదివాసీ ప్రాంతాలు తిరిగాను. మాతా, శిశు ఆరోగ్యంలో భాగంగా నేడు అమలవుతున్న కార్యక్రమాలకు మార్గదర్శకాలు రూపొందించాను. మేం చేసిన సిఫారసులకు అనుగుణంగానే ‘టేక్ హోమ్ రేషన్’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. వాటి ఫలితంగానే నడి వయసు స్త్రీలలో (40 ఏండ్లు) అనారోగ్య సమస్యలు, శిశు మరణాలు బాగా తగ్గాయి. పోలియో టీకాలు ఇచ్చే సమయంలోనే విటమిన్-ఎ సప్లిమెంట్స్ కూడా ఇచ్చి మెరుగైన ఫలితాలు సాధించాం.
ఎన్ఐఎన్ డైరెక్టర్గా నాలుగేండ్లుగా పనిచేస్తున్నాను. ఈ కాలంలోనే ప్రపంచమంతా కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కొన్నది. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీలో మా సంస్థ ఎంతగానో శ్రమించింది. ‘ఇండియన్ డైటరీ గైడ్లైన్స్-2020’ కోసం కూడా నేను పనిచేశాను. దీని కోసం దేశంలోని అన్ని జిల్లాల ఆహార విధానాలపైనా అధ్యయనం చేశాం. ఎన్ఐఎన్ ‘డైటరీ గైడ్లైన్స్’ 2011లో విడుదలైన తర్వాత.. ఈ పదేండ్లలో చాలా మార్పులు వచ్చాయి. తీసుకునే ఆహారం, జీవనశైలి మారిపోయాయి. ప్రతి జిల్లాలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? వాళ్ల జీవన విధానం ఎలా ఉంది? అవసరమైన పోషకాహారం ఎంత?.. ఇవన్నీ తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశాం. ఈ ఏడాది చివర్లో ఆ నివేదికను విడుదల చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం నిర్ణయించడానికి ఈ గణాంకాలే ప్రామాణికం. ఈ మధ్యనే ‘న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఫర్ ఇండియన్స్ 2020’ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. దీనికి నేను మెంబర్ సెక్రటరీగా పనిచేశాను. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులకు నాయకత్వం వహించడం ద్వారా దేశానికి నా వంతు సేవ చేశానని గర్వంగా చెప్పగలను. ఒక డాక్టర్గా క్లినిక్కే పరిమితమై ఉంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదేమో.
ఏదైతే నమ్ముతున్నామో దాన్ని పాటించాలి. అప్పుడే చెప్పే అర్హత కూడా ఉంటుంది. నలుగురికీ పోషకాహారం విలువల గురించి చెప్పే నేను, దానిని పక్కాగా పాటిస్తాను. మా ఇంట్లోవాళ్ల ఆహారపు అలవాట్లలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఉప్పు, కారం, నూనెలు, వేపుళ్లు, బేకరీ ఫుడ్ పూర్తిగా తగ్గించేశాం. రుచుల కన్నా ఆరోగ్యం ముఖ్యం. నా ఆలోచనకు మా ఆయనా ఓకే చెప్పారు. ఇప్పుడు ఇంటికొచ్చే అతిథులూ మా మెనూ ఫాలో అవ్వాల్సిందే. రుచి కోసం ఆరోగ్యం పాడు చేసుకోవద్దు కదా! నూనె, ఉప్పు, మసాలాలు.. ఇలా ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే సరిపోతుంది.
మా ఆయన పేరు రాజ్కుమార్. బ్యాంక్ మేనేజర్గా పని చేశారు. మాది ప్రేమ వివాహం. మావారు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. పరిశోధన రంగంవైపు వెళ్తానని ముందుగా ఆయనకే చెప్పాను. ప్రాక్టీస్లో ఉన్నంత సంపాదన సైంటిస్ట్కు లేదని తెలిసినా ఆయన నన్ను ప్రోత్సహించారు. శాస్త్రవేత్తగా రాణించడం అంటే మాటలు కాదు. ఎంతో కష్టపడాలి. ఇల్లు, పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూనే సమర్థంగా ఉద్యోగం చేయగలగాలి. అన్ని ఉద్యోగాల్లా ఇది ఒక సమయానికి పూర్తవుతుందని చెప్పలేం. పరిశోధనలో పడితే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఇంట్లో కూడా ఆఫీస్ పనిచేయాల్సి వస్తుంది. మా అబ్బాయిని పట్టించుకునే తీరిక కూడా ఉండకపోయేది. కానీ, మా బాబు కూడా నన్ను అర్థం చేసుకున్నాడు. మా ఆయన, అమ్మ, అత్తయ్య నన్ను గెలిపించారు.
…? నాగవర్ధన్ రాయల
కిక్ కోసం ఐఏఎస్ వదిలి.. అడవుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు”