కరీంనగర్ : స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలను పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ.. దేశం గర్వించేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గడిచిన 75 సంవత్సరాలలో మనదేశం ఎంతో పురోగతిని సాధించిందని తెలిపారు. భారత కీర్తి పతాకా దశ దిశలా వ్యాప్తి చెందేలా అగస్టు 8 నుంచి 15 రోజుల పాటు వజ్రోత్సవాలను కుల,మతాలకు అతీతంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో 3,08,754 గృహాలను గుర్తించాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 79,953 గృహాలలో ప్రతి ఇంటి పై జెండా రెపరెపాలాడాలని, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజాప్రతినిధులకు, అధికారులకు జాతీయజెండాలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.