హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ జాతీయ పతాకాలను పంపిణీ చేయనున్నామని, ఇప్పటికే కోటి 20 లక్షల జెండాలను సిద్ధం చేయిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన
వజ్రోత్సవ వేడుకల లోగోను కమిటీ సభ్యులతో కలిసి కే కేశవరావు రవీంద్రభారతిలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 8న వేడుకలు ప్రారంభమవుతాయని, 22న ఎల్బీ స్టేడియం వేదికగా ముగుస్తాయని చెప్పారు. ఈ వేడుకల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
గాంధీ చిత్ర ప్రదర్శనలు.. తిరంగా రక్షా బంధన్లు
గాంధీ సినిమాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 15రోజుల పాటు ప్రదర్శించాలని నిర్ణయించినట్టు కేకే తెలిపారు. అదేవిధంగా వ్యాప్తంగా చారిత్రక ప్రదేశాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేయాలని, వాటి ఔన్నత్యాన్ని తెలిపే విధంగా డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షా బంధన్ వేడుకలను సైతం జాతీయ స్ఫూర్తితో నిర్వహించుకోవాలని, అందుకు మూడు రంగుల రాఖీలను వినియోగించుకోవాలని కోరారు. జాతీయ పతాకం లోగోతోనే అన్ని ప్రభుత్వ లెటర్హెడ్స్ ఉండాలని చెప్పారు. రవీంద్రభారతిలో 15రోజుల పాటు సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఫ్రీడం పోటీలను ఏర్పాటు చేయనున్నామని, ఏఆర్ రెహమాన్, జేసుదాసుతో మ్యూజికల్ నైట్ నిర్వహించాలని యోచిస్తున్నామని వెల్లడించారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని అన్ని కళా రంగాల్లో ఉత్తములను, అత్యుత్తమ సేవలను సంస్థలను గుర్తించి అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
21న అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశం
వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించనున్నామని కేకే ఈ సందర్భంగా వెల్లడించారు. 75 మంది కళాకారులతో.. 75 ముఖ్యమైన సంఘటనలపై చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక ఈ నెల 21న ప్రత్యేకంగా శాసనసభ, శాసనమండలి సంయుక్తంగా సమావేశం కానున్నాయని, దేశాభివృద్ధిపై పలు ప్రత్యేక తీర్మానాలు చేయనున్నాయని తెలిపారు. రాష్ట్రమంతటా ఏకకాలంలో జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. నిర్దేశిత తేదీన, సమయంలో ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలాపించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా 2కే రన్ను నిర్వహించనున్నామని, జానపద పండుగలు.. ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. వరంగల్ జైలును ఓపెన్ జైలుగా మార్చాలని సీఎం కేసీఆర్కు కమిటీ ప్రతిపాదించిందని చెప్పారు. సమావేశంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ కమిటీ సభ్యులు కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, మామిడి హరికృష్ణ, అధికారులు శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.