యావత్ తెలంగాణ ఒక్క గొంతుకైంది. రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘జన గణ మన’ పాడి వజ్రోత్సవ భారతికి ముక్తకంఠంతో హారతినిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషంపాటు రాష్ట్రం ఎక్కడికక్కడ స్తంభించింది.
బడుల్లో విద్యార్థులు, పొలాల్లో రైతు కూలీలు, బస్సులు, మెట్రోలో ప్రయాణికులు, ఒకరేమిటి.. యావత్ తెలంగాణ ప్రజానీకం సామూహిక జాతీయ గీతాలాపనలో గళం కలిపారు. ఊరూరా దేశభక్తి ఉప్పొంగింది. హైదరాబాద్ అబిడ్స్లోని నెహ్రూ సర్కిల్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు శాంతికపోతాన్ని ఎగురవేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.