వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటుతున్నది.. ఊరూవాడా దేశభక్తి వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొమ్మిదో రోజు మంగళవారం ఉదయం 11:30 గంటలకు సకలజనం సామూహిక గీతాలాపన చేశారు. పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులు, కూడళ్ల వద్ద వందలాది మంది ఏకకాలంలో ‘జన గణ మన’ గీతాన్ని గొంతెత్తి 56 సెకన్లపాటు ఆలపించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ, హుజూరాబాద్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అల్గునూర్ చౌరస్తాలో రసమయి బాలకిషన్, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి వందనం చేశారు. తిమ్మాపూర్ మండలంలో రేణికుంట పంట పొలాల్లో రైతులు, గొర్ల కాపరులు, బిహార్ కూలీలు గీతాలాపన చేశారు.
కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం తొమ్మిదో రోజు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో దేశభక్తి ఉప్పొంగింది. యువకులు, విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాలను పట్టుకుని వీధుల్లో చేరి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించారు. సరిగ్గా ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపన చేసి ప్రజలు దేశభక్తిని చాటారు. ‘జనగణ మన అధినాయక జయహే’ అంటూ అందరు కలిసికట్టుగా గళమెత్తారు. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల, వినోద్కుమార్ మాట్లాడుతూ శతాబ్ధి ఉత్సవాల నాటికి దేశం సూపర్ సాఫ్ట్ పవర్గా ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యా, విజ్ఞానం, వ్యవసాయం, ఇండస్ట్రీ వంటి శాస్త్రీయత దేశంలో పెరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, హుజూరాబాద్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విద్యార్థులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఎస్సీకార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. తిమ్మాపూర్ పోలీసులు అల్గునూర్ చౌరస్తాలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి జాతీయ గీతాన్ని ఆలపించగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఇటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో కూడా గీతాలాపన జరిగింది. ఎల్ఎండీ రిజర్వాయర్ గేట్లపై వ్యవసాయ, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గీతాలాపన చేశారు. తిమ్మాపూర్ మండలంలో రేణికుంట పంట పొలాల్లో రైతులు, గొర్ల కాపరులు, బిహార్ కూలీలు గీతాలాపన చేశారు. గ్రామ గ్రామాన ఉదయం 11.30 గంటలకు ఎక్కడి ప్రజలు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, కూలీలు కూడా ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
గోదావరిఖని: కల్యాణ్నగర్లో నినదిస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కమాన్ చౌరస్తా: అల్గునూర్లో బెలూన్లు ఎగురవేస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
జగిత్యాల: కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, ప్రజాప్రతినిధులు