హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ‘ఈ రోజు బిల్కిస్ బానోకు జరిగింది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చని గుర్తుంచుకోండి. స్పీక్ అప్ ఇండియా (భారతదేశమా గళం విప్పు)’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. బిల్కిస్బానో గ్యాంగ్రేప్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న దోషుల విడుదలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. జైలునుంచి వచ్చినవారిని విశ్వహిందూ పరిషత్ పూలమాలలతో సత్కరించిన ఫొటోలు సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఇది మన దేశ మనస్సాక్షికి మచ్చ. రేపిస్టులకు పూలమాలలు వేసి యుద్ధ వీరులుగా.. స్వాతంత్య్ర సమరయోధులుగా పరిగణిస్తున్నారు.
ఈ రోజు బిల్కిస్ బానోకు జరిగింది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చని గుర్తుంచుకోండి. స్పీక్ అప్ ఇండియా(భారతదేశమా గళం విప్పు)’ అని ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుపై నెటిజన్లు స్పందించారు. ‘బిల్కిస్ బానోకు మద్దతుగా దేశం మొత్తం పోరాడాలని.. జరిగిన అన్యాయానికి బీజేపీ, మోదీ బహరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేపిస్టులపై కనికరం చూపొద్దని, వారిని తిరిగి జైలుకు పంపాలని ట్వీట్లు చేశారు. ‘రేపిస్టులు త్వరలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ చర్యను వ్యతరేకించకపోతే బీజేపీ ఆగడాలను ఇకపై కూడా అడ్డుకోలేం’ అని కొందరు. ‘వీహెచ్పీ, ఆర్ఎస్సెస్లకు ఇది సిగ్గుచేటు..’ అని మరి కొందరు ట్వీట్లు చేశారు.
మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేం: స్మితా సబర్వాల్
బిల్కిస్ బానో కేసుపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తీవ్రంగా స్పందించారు. ‘ఒక మహిళగా, సివిల్ సర్వెంట్గా బిల్కిస్ బానో కేసు వార్తలను నేను నమ్మలేకపోయాను. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న బిల్కిస్ బానో హక్కులను తుడిచిపెట్టి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేం’ అని ఆమె ట్వీట్ చేశారు.