ముంబై : సీనియర్ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతున్నారు. న్యూమోనియా బారినపడ్డట్లు మేనేజర్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. నసీరుద్దీన్ షా రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చేరారని, న్యూమోనియా బారినపడ్డారని, ఊపిరితిత్తుల్లో ఒక ప్యాచ్ ఉందని.. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారని చెప్పారు.
ఒకటి, రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. నసీరుద్దీన్ షా వెంట ఆసుపత్రిలో ఆయన సతీమణి రత్న పాథక్ షాతో పాటు పిల్లలూ ఉన్నారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ షా బాలీవుడ్ ప్రముఖ నటుల్లో ఒకరు. ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు. ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘బాండిష్ బండిట్స్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. చివరిసారిగా షా నటించిన రాంప్రసాద్ కి తెహర్వి ఈ ఏడాది ప్రారంభంలో నెట్ఫ్లిక్స్లో ప్రసారమైంది.