ఆ ఆవరణ ప్రగతి కార్ఖానా. రుణాలు మంజూరు చేస్తుంది. ఉపాధి మార్గం చూపుతుంది. పొదుపు-మదుపు పాఠాలు నేర్పుతుంది. క్రమశిక్షణకు తానే ఓ ఉదాహరణగా నిలుస్తుంది. నర్సంపేట ఆదర్శ మహిళా మండల సమాఖ్య తన ఆత్మవిశ్వాసానికి గుర్తింపుగా ఆత్మనిర్భర్ భారత్ అవార్డునూ అందుకున్నది.
మన కోసం మనం.. ఆ మహిళా మండల సమాఖ్య నినాదం, విధానం కూడా. కాబట్టే, రుణాల మంజూరులో ముందున్నది. రుణాల వసూలులోనూ అగ్రస్థానంలో ఉన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆదర్శ మహిళా మండల సమాఖ్య.. బతుకులను మార్చింది, ఆలోచనలను మార్చింది, ఎంతోమంది భవితవ్యాన్నీ మార్చింది. అంతేనా.. పొదుపు-మదుపు విలువను తెలియజేసింది. జీవనోపాధి అవకాశాలను విస్తృతం చేసింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా పొందిన రుణాలను దుబారా చేయకుండా వ్యాపారం, వ్యవసాయం, కూరగాయలు, పండ్ల తోటల సాగు, డెయిరీ, చదువు.. తదితర ప్రయోజనాత్మక మార్గాలవైపు మళ్లించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నది. ఆ పనితీరును గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ సంఘటన్ అవార్డుతో సత్కరించింది. లక్ష రూపాయల బహుమతి అందజేసింది.
అంకెల్లో అద్భుతాలు
నర్సంపేట సమాఖ్య పరిధిలో మండలంలోని 993 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం 10,716 మందికి సభ్యత్వం ఉంది. ఒక్కో సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 39 గ్రామైక్య సంఘాలు (వీవోలు) చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ఏటా ఈ సమాఖ్యలోని మహిళలకు వివిధ రూపాల్లో రుణాలు అందిస్తుంది. ఆ డబ్బుతోవారు కిరాణాషాపు, వస్త్ర దుకాణం, వాటర్ ప్లాంట్, పిండి గిర్ని, పేపర్ ప్లేట్ల యూనిట్, డెయిరీ ఫామ్ మొదలైనవి ప్రారంభిస్తున్నారు. పండ్లు, కాయగూరలు, పప్పు దినుసులు సాగు చేస్తున్నారు. తమ ఉత్పత్తులను నర్సంపేటతో పాటు వరంగల్కు తరలించి విక్రయిస్తున్నారు. అంతేకాదు, తీసుకున్న రుణాలను సక్రమంగా తీరుస్తున్నారు. నూరుశాతం రికవరీతో జీరో వడ్డీకి అర్హత సాధించి ప్రభుత్వ ప్రశంసలూ పొందుతున్నారు.
సర్కారీ నిధులకు రాబడి తోడుకావడంతో రూ.1.20 కోట్ల సామాజిక పెట్టుబడి నిధి ఉందిప్పుడు. నర్సంపేట సమాఖ్య క్రమశిక్షణలోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. సిబ్బంది హాజరు, చెల్లింపులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి అభినందనలు అందుకున్నది. ఈ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినెలా.. నర్సంపేటలోని కార్యాలయంలో సమావేశమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటుంది. సభ్యుల హాజరు కూడా వందశాతంగా నమోదైంది. సమైక్యతకు గుర్తుగా సభ్యులంతా డ్రెస్కోడ్ పాటిస్తారు. తాజాగా, కేంద్ర అవార్డు వచ్చిన నేపథ్యంలో.. జమ్మూకశ్మీర్ నుంచి వచ్చిన ఓ బృందం నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట, మహేశ్వరం, నర్సంపేట తదితర గ్రామాల్లో పర్యటించింది. సమాఖ్య పనితీరును తెలుసుకుంది. వేనోళ్లా ప్రశంసించింది. నిజమే, కశ్మీరమే కాదు, ఆసేతు హిమాచలం .. దేశంలోని ప్రతి మహిళా సంఘాన్నీ నర్సంపేటకు తీసుకురావాలి. ‘ఓ సంస్థను విజయవంతంగా నడిపించడం ఎలా?’ అన్న కోణంలో వారికి ఇక్కడ శిక్షణ ఇప్పించాలి. నష్టాల్లో కునా రిల్లుతున్న ప్రభుత్వరంగ సంస్థలకూ ఈ నియమం వర్తింపజేయాలి. డబ్బులే కాదు, గెలుపూ ఊరికే రాదు!
గర్వంగా ఉంది
– మోటూరి శ్వేత, అధ్యక్షురాలు
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆత్మనిర్భర్ సంఘటన్ అవార్డు రావడం గర్వకారణం. సమాఖ్యలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ ఘన విజయం సాధ్యమైంది. ముఖ్యంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు రుణ పడి ఉంటాం. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు.
– వేముల రాజేశ్వర్ రావు