రానున్న మా ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోయిన కూడా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరి మధ్య జోరుగా వాదనలు నడుస్తున్నాయి. మా సభ్యులందరికీ హేమ వాయిస్ మెసెజ్లు పంపగా, అందులో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మీద సంచలన కామెంట్స్ చేశారు. ఇంత వరకు రూపాయి కూడా సంపాదించి పెట్టలేదని ఉన్నదంతా ఊడ్చేస్తున్నారన్నట్టుగా ఆరోపించారు.
ఇంత వరకు నరేష్ ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు. పోయినసారి మెడికల్ క్లైమ్కి, రాబోయే మెడికల్ క్లైమ్కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇదివరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు.
ఆయన కుర్చీ దిగకూడదు… ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు అని హేమ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై నరేశ్, జీవితలు మాట్లాడుతూ.. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని, తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తప్పవని అన్నారు. మేము మాకున్న ఇమేజ్ తో ఫండ్ తెస్తున్నాం తప్ప ఖర్చు పెట్టడం లేదు. ఈ టర్మ్లో కోటి రూపాయల ఫండ్ సమకుర్చామని నరేశ్ తెలిపారు.
కరోనా దృష్యా ఎన్నికలు ఎపుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.