అమరావతి: ఆర్థికంగా చితికిపోయి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వల్లనే నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. పెడనలో నేత కార్మిక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై లోకేశ్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. వారికి చేతినిండా పని చూపిస్తే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని ప్రశ్నించారు.
చేనేత రంగం కుదేలయ్యేలా సీఎం జగన్ నిర్ణయాలు ఉన్నాయని లోకేశ్ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల కారణంగా నేత కార్మికులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని తెలిపారు. అప్పులను తీర్చే మార్గం కానరాక కుటుంబాలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను నేతన్నలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఇలాంటి ఆత్మహత్యలు మరిన్ని చూడాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెనకబడిన వర్గాల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు.