అమరావతి : ఏపీలో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ను ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. తనను తానే శాశ్వత అధ్యక్షుడుగా ప్రకటించుకోవడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను జగన్ మించిపోయాడని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్కు భద్రతను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే కోపంతో కేశవ్ కు భద్రతను తొలగించారని పేర్కొన్నారు.
తనకు అదనపు భద్రత కావాలని ప్రభుత్వాన్ని కోరితే ఉన్న సెక్యూరిటీని తొలగించి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. తక్షణమే కేశవ్కు అదనపు గన్మెన్లను కేటాయించి సెక్యూరిటీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాగా కేశవ్కు భద్రతను తొలగించామని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు.అతడికి వన్ ప్లస్ వన్ గన్మెన్లు కొనసాగుతారని వివరించారు.