యాదాద్రి, సెప్టెంబర్ 28 : యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి నిత్యపూజలు బుధవారం కోలాహలంగా నిర్వహించారు. తెల్లవారు జామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకుల తిరువారాధన, బాలబోగం అనంతరం నిజాభిషేకం నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహనంపై ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7గంటలకు స్వామివారికి తిరువారాధన, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు.
రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అనుబంధ శివాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పర్వత వర్ధినీ అమ్మవారికి పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ.12,28,819 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారి సేవలో హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద, మేజర్ జనరల్ ప్రిత్ పాల్ సింగ్
శ్రీవారిని హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద, మేజర్ జనరల్ ప్రిత్ పాల్ సింగ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం రాత్రి యాదాద్రికి చేరుకున్న హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద వైటీడీఏ ప్రెసిడెన్సియల్ సూట్లో బస చేశారు. బుధవారం ఉదయం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేజర్ జనరల్ ప్రిత్ పాల్ సింగ్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సుదర్శన నారసింహ హోమంలో యశోద సీనియర్ వైద్యుడు విజయ్కుమార్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
యాదాద్రి ఆలయ నిర్మాణాలు పరిశీలన
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆర్అండ్బీ టెక్నికల్ కమిటీ బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇప్పటికే పూర్తై వాడుకలోకి వచ్చిన పనులు, తాజాగా కొనసాగుతున్న పనుల నాణ్యాతా ప్రమాణాలను పరిశీలించింది.