చండూరు,(గట్టుప్పల) సెప్టెంబర్ 21 : గట్టుప్పలలో ఫిరాయింపుదారులకు ఘోర పరాభావం ఎదురైంది. బీజేపీలో చేరడంతో ప్రజల నుంచి చుక్కెదురైంది. పదేపదే పార్టీలు మారడంపై ప్రజలు ఆగ్రహించారు. రాత్రికిరాత్రే డబ్బులకు అమ్ముడుపోవడంతో కోపోద్రిక్తులైన ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ఊరంతా కదలివచ్చి వారు పార్టీ మారడాన్ని నిరసన వ్యక్తం చేశారు. బీజేపీలోకి వెళ్లిన చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, చెరిపల్లి భాస్కర్పై తిట్ల పురాణం అందుకున్నారు. చిన్నా పెద్ద, ముసలిముతక అంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. వేల మంది ఏకమై ఫిరాయింపుదార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గట్టుప్పల మండల కేంద్రంలో భారీ ఎత్తున చావుడప్పులతో వారి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. గ్రామాల్లోని వీధులన్నీ తిరిగి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఫిరాయింపుదారుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
గట్టుప్పలలో అడుగుపెడితే సహించం..
గట్టుప్పలలో అడుగుపెడితే సహించేది లేదంటూ, పార్టీ మారిన వారిని జనం హెచ్చరించారు. తమ స్వార్థం కోసం ఇంకా ఎన్నిసార్లు పార్టీలు మారుతారని మండిపడ్డారు. రూ.కోట్ల డబ్బులకు అమ్ముడుపోయి, ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టారని దుమ్మెత్తి పోశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక స్వలాభం కోసం పార్టీ మారిన వ్యక్తి చెంతన చేరి మండల ప్రజలకు అన్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని నినదించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తాము టీఆర్ఎస్లోనే కొనసాగుతామంటూ ప్రతిన బూనారు. రాజగోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు.
డబ్బు రాజకీయాలతో అభివృద్ధి కుంటు..
కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు. పైసలతో స్థానిక నేతలను ప్రలోభపెడుతూ పదేపదే పార్టీలు మారేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే పార్టీలు ఫిరాయించడంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతున్నది. మునుగోడు నియోజకవర్గ చరిత్రలో ఒక్కసారి మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఎంతో అభివృద్ధి జరిగింది. రానున్న ఉప ఎన్నికల్లో పెట్టుబడిదారులను తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– పెదగోని వెంకన్న, టీఆర్ఎస్ నేత
టీఆర్ఎస్లో నుంచి బీజేపీకిలోకి వెళ్లడానికి సిగ్గుండాలి..
ప్రస్తుత రాజకీయాల్లో అడ్డగోలుగా పార్టీలు మారుతున్నారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకి ఎలా వెళతారు..? అర్ధరాత్రి వరకు టీఆర్ఎస్లో ఉండి బీజేపీలోకి మారడానికి సిగ్గుండాలి. అసలు బీజేపీలోకి ఎందుకు పోతున్నారో సమాధానం చెప్పాలి. పైసలకు అమ్ముడుపోయి పార్టీలు మారుతున్నారు. నేతలు పోయినా.. ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వెంటనే ఉంటారు. నిఖార్సైన కార్యకర్తలు, నేతలు ఎప్పటికీ గులాబీ పార్టీకి అండగా నిలబడతారు. బంగారు తెలంగాణ లెక్క టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంగారు గట్టుప్పల సాధించుకుంటాం.
– మాదగోని వెంకటేశ్గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు, గట్టుప్పల