నందికొండ, ఆగస్టు 15 : కృష్ణమ్మ హోరెత్తుతూ దిగువకు ప్రవహిస్తుండగా కృష్ణా పరీవాహక ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపుర్, జురాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద జోరు కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండటంతో శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీటిని అంతే స్థాయిలో క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఈనెల 11న 26 క్రస్ట్ గేట్ల ద్వారా ప్రారంభమైన నీటి విడుదల కొనసాగుతూనే ఉన్నది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం 585.30 (297.1465 టీఎంసీ) అడుగుల మేర ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 3,94,778 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 62,436 క్యూసెక్కులు, 10 క్రస్ట్ గేట్ల నుంచి 3,77,160 క్యూసెక్కుల ఇన్ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వస్తున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు 5 అడుగులు, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి సుమారు 2,62,052 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడికాల్వకు 8,604 క్యూసెక్కులు, ఎడుమ కాల్వకు 8,591 , ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32,967, ఎస్ఎల్బీసీకి 2,400, ఎల్ఎల్సీకి 300 క్యూసెక్కులతో కలిపి మొత్తం 3,14,864 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయికి 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50( 212.9198 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నది.
పర్యాటకుల సందడి
వరుసగా సెలవులు రావడం, నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో డ్యాం పరిసర ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులతో శివాలయం పుష్కర్ఘాట్, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద, కొత్తవంతెన, ప్రధాన డ్యాం, లాంచీస్టేషన్ పర్యాటకులతో రద్దీగా మారాయి. తెలంగాణ టూరిజం కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన జాలీ ట్రిప్పునకు, నాగార్జునకొండకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. డ్యాం పరిసరాలు, లాంచీ స్టేసన్ వద్ద నదీ తీరంలో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. పర్యాటకులతో లాంచీ స్టేషన్, బుద్దవనం, డ్యాం పరిసరాలు కిటకిటలాడాయి.
3 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 2,089.75 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు 3 గేట్ల నుంచి 829.76 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాలువలకు 291.48 క్యూసెక్కు లు, ఎడమ కాలువకు 218.61 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 638.60 (2.90 టీఎంసీలు)అడుగులుగా ఉందని ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.
టెయిల్పాండ్కు కొనసాగుతున్న వరద
అడవిదేవులపల్లి : మండలకేంద్రానికి చేరువలో ఉన్న టెయిల్పాండ్ ప్రాజెక్టుకి సోమవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 2,90,392 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ఇన్చార్జ్ ఏడీ నరసింహరావు తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 15 క్రస్ట్గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి 2,77,320 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టెయిల్పాండ్ ప్రా జెక్టు నిల్వ సామర్థ్యం సుమారు 7,080 టీఎంసీలు కాగా ప్రస్తు తం 4,856టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని ఆయన తెలిపారు.