పునరుద్ధరణతో పది గ్రామాల రైతులకు మేలు
హాలియా నుంచి పేరూరు సోమసముద్రం
వరకు కాకతీయుల కాలంలో నిర్మాణం
కాంగ్రెస్ పాలనలో కనుమరుగైన కాల్వ
ఎమ్మెల్యే నోముల కృషితో పునర్నిర్మాణం
రూ.2.20కోట్లతో 4కి.మీ.మేర మరమ్మతు
స్వరాష్ట్రం సిద్ధించాక ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నీటిపారుదల రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. వృథాగా వెళ్తున్న నీటిని ఒడిసిపట్టి
వ్యవసాయ అవసరాలకు మళ్లించింది. ఈ నేపథ్యంలో కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారు చిన్ననీటి వనరులకు సైతం ఊపిరి పోస్తున్నది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాచకాల్వ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అహల్యవాగుపై కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ రాచకాల్వ మరమ్మతు ఫలితంగా పది గ్రామాల ప్రజలకు మేలు జరుగనున్నది.
కాకతీయుల కాలంలోనే రాచకాల్వ నిర్మాణం…
అహల్య.. జీవనది. 365రోజులు ప్రవహిస్తుంది. కాలక్రమేణా పూడిపోవడం, ఆక్రమణకు గురికావడంతో కుచించుకుపోయి వాగుగా మారింది. ఈ ప్రాంత ప్రజల తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొన్న కాకతీయ రాజులు అక్కడక్కడా చెరువులు నిర్మించి కాల్వలను తవ్వించారు. అహల్య గ్రామం నుంచి పేరూరు సోమసముద్రం చెరువు వరకు రాచకాల్వను తవ్వించారు. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది.
కాంగ్రెస్ పాలనలో…
కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న నీటిపారుదల రంగాన్ని విస్మరించడంతో కాకతీయుల రాజుల పాలనలో నిర్మించిన కాల్వలు శిథిలావస్థకు చేరాయి. రాచకాల్వను పట్టించుకోకపోవడంతో ఆక్రమణకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో చిన్ననీటి పారుదలకు ప్రాధాన్యమిచ్చారు. అహల్య నది నుంచి పేరూరు గ్రామం వరకు కాకతీయుల కాలంలో నిర్మించిన రాచకాల్వను పునర్నిర్మించాలని కోరుతూ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. అడిగిందే తడవుగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో రాచకాల్వ పునరుద్ధరణకు రూ.2.20కోట్లు మంజూరు చేశారు.
అదే విధంగా మదారిగూడెం గ్రామంలో కాల్వకు ఇరువైపులా 300మీటర్ల మేర సైడ్వాల్స్ నిర్మాణం కోసం ఇటీవల అదనంగా రూ.90లక్షలను మంజూరు చేశారు. పేరూరు చెరువులో పూడికతీత, అలుగు నిర్మాణం, కరకట్ట మరమ్మతులతో పాటు హాలియా వాగుపై కత్వ నిర్మాణం, హాలియా నుంచి పేరూరు చెరువు వరకు నాలుగు కిలోమీటర్ల మేర కాల్వ తవ్వించారు. మదారిగూడెం వద్ద 300మీటర్ల మేర సైడ్వాల్స్ సీసీ లైనింగ్ పనులు సైతం పూర్తయ్యాయి. హాలియా వాగుపై కత్వ మరమ్మతులు, పేరూరు చెరువుపై అలుగు నిర్మాణ పనులు గతంలోనే పూర్తి చేశారు. కాల్వలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తే రాచకాల్వ ద్వారా 10గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. హాలియా, మదారిగూడెం, పేరూరు, చల్మారెడ్డిగూడెం, పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డతండా తదితర గ్రామాల్లో తాగు, సాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలిగిపోవడంతో పాటు ఆయా గ్రామాల రైతులు ఏడాది పొడవునా మూడు పంటలు పండించుకునే అవకాశం లభిస్తుంది. అదే విధంగా మండలంలోని హాలియా, ఇబ్రహీంపేట, అనుముల గ్రామాల్లో సైతం భూగర్భజలమట్టం భారీగా పెరిగే అవకాశం ఉంది.
నర్సింహయ్య కృషితో రాచకాల్వకు పూర్వవైభవం
రాచకాల్వపై కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో కాల్వ ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. ఈ ప్రాంత వెనుకబాటుకు గత పాలకులే కారణం. 30ఏండ్లుగా ఏలిన జానారెడ్డి ఏ మాత్రమూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కృషితో రాచకాల్వకు పూర్వవైభవం దక్కింది.
రైతుకు మేలు…
రాచకాల్వ పునర్నిర్మాణంతో ఈ ప్రాంత రైతులకు చాలా మేలు జరుగనుంది. గతంతో సాగర్ ఎడమ కాల్వ రాకపోతే తాగు, సాగునీటికి కటకట ఉండేది. అహల్య వాగు నీటిపైనే ఆధారపడేది. అహల్య వాగు 365రోజులు ప్రవహిస్తుంది. హాలియా నుంచి పేరూరు వరకు రాచకాల్వ నిర్మాణంతో తాగు, సాగునీటికి ఢోకా ఉండదు.