ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా అభివృద్ధికి కృషి
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
త్రిపురారం, మార్చి 28 : దళితుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదని, ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి రూ.1200 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే చెందుతుందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మండల కేంద్రంలో ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం మాల మహానాడు నియోజకవర్గ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుమన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల్లో దళితులను కూర్చోబెట్టిన ఘనత టీఆర్ఎస్దే అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి గ్రామాల్లో, దళిత వాడల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ ద్వారా ఎస్సీలకు 17శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున 120అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, గ్రామాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ వ్యాయామ పాఠశాలలు ఏర్పాటు చేసి రాష్ర్టాభివృద్ధి కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి ఇచ్చేవిధంగా సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. జానారెడ్డి పండుగ. పబ్బానికి వచ్చి కాలం గడుపుతూ వెళ్లిపోయాడు తప్ప.. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడలేదని అన్నారు. గిరిజనులను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలన్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. దళితుల సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మహబాబాబూద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, వ్యవసాయానికి నీరు.. ఇలా ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి ఇంటికీ చేరిందని, సాగర్ నియోజకవర్గంలో లక్షా 53వేల మంది లబ్ధిదారులున్నారని అన్నారు. సంక్షేమ పథకాలే సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, అనుముల నర్సిరెడ్డి, రామచంద్రయ్య, మాలమహానాడు మండలాధ్యక్షుడు కోడిరెక్క నర్సింహ, కొల్లి రాము, యాదగిరి, లక్ష్మణ్, ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.