హాలియా/మాడ్గులపల్లి, మార్చి 26 : తలాపున కృష్ణమ్మ పారుతున్నా సాగు నీరందని దుస్థితి. నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల భూములు సాగుకు నోచక బీళ్లుగా మారాయి. స్థానికుల ఆందోళనల నేపథ్యంలో 1997 సంవత్సరంలో లోలెవల్ కెనాల్కు అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పనులు ప్రారంభం కాకపోవడంతో తిరిగి 2007సంవత్సరంలో టెండర్లు పిలిచారు. రూ.175కోట్ల వ్యయంతో ప్రారంభమైన పనులు 2009డిసెంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తిరిగి 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ వరద కాల్వ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించారు.
ఏండ్లకేండ్లు వివక్ష ఇలా..
2007లో పెద్దవూర మండలం పూల్వాతండా(పొట్టిచెల్మ)వద్ద మూడు మోటర్లతో లిప్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పంపుహౌస్ నిర్మాణానికి రూ.108కోట్లు, కాల్వల నిర్మాణానికి మరో రూ.104కోట్ల అంచనాతో 2009సంవత్సరంలోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఆచరణకు నోచలేదు. నాటి టీడీపీ ప్రభుత్వం పునాది రాయి వేసి ఓట్లు దండుకున్నది. పదేండ్ల పాలనలో 27కి.మీ.మాత్రమే కాల్వలు తవ్వింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల ఊసే లేకుండా జలయజ్ఞం పథకం కింద చేర్చి మ.మ. అనిపించింది
నాడు బీడు భూములు…
చెరువులు ఎండిపోయి, కుంటలు ఆనవాళ్లు కోల్పోయి పశువులకు సైతం నీరు దొరక్క వాటిన అమ్ముకున్న పరిస్థితి. అదే ప్రాంతంలో నేడు కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మాడ్గులపల్లి మండలంలోని గారకుంటపాలెం, కన్నెకల్, నారాయణపురం, దాచారం, పూసలపహాడ్, గజలాపురం, అభంగాపురం, మాడ్గులపల్లి, కుక్కడం, తోపుచర్ల, ఇస్కబాయిగూడెం, పుచ్చకాయలగూడెం, సీత్యాతండాల్లోని 35చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. సుమారు 10వేల ఎకరాల ఆయకట్టులో వరి పండుతున్నది. వ్యవసాయం అంటేనే భయపడిన రైతులు.. నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. 2019సంవత్సరంలో 65వేల మెట్రిక్ టన్నులు, 2020సంవత్సరంలో 80వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారు. తాజాగా యాసంగిలో 23వేల ఎకరాల్లో వరి సాగవుతున్నది.
శరవేగంగా నిర్మాణం పూర్తి..
2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.93కోట్లు మంజూరు చేసింది. పంప్ హౌస్ నిర్మాణానికి రూ.54కోట్లు ఖర్చుచేసింది. 110ప్యాకేజీ కింద కాల్వ నిర్మాణ పనుల కోసం రూ.39కోట్లు విడుదల చేసి శరవేగంగా పనులు పూర్తిచేయించింది. 2016 నవంబర్9న మంత్రి తన్నీరు హరీశ్రావు పంప్హౌస్ను ప్రారంభించారు.
84వేల ఎకరాలకు నీరు
నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాల్లోని ఏడు మండలాల ప్రజలు వరద కాల్వ ద్వారా లబ్ధిపొందుతున్నారు. పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, కనగల్, మాడ్గులపల్లి, వేములపల్లి మండలాల్లో 27చెరువులు నింపుతుండగా 84వేల ఎకరాలకు నీరందుతున్నది. పెద్దవూర మండలంలో 9191ఎకరాలు, అనుములలో 12094 ఎకరాలు, నిడమనూరులో 11302ఎకరాలు, త్రిపురారం మండలంలో 4605ఎకరాలు సేద్యంలోకి వచ్చింది. చెరువులు నిండుకుండలా మారడంతో భూగర్భ నీటిమట్టం పెరిగి కరువు తీరింది.