రామగిరి, మార్చి 24 : ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ బుధవారం రాత్రి నల్లగొండలో కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో ‘అఖండ హనుమాన్ చాలీసా పారాయణం’ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాల్లో రెండు మండలాల కాలంపాటు నిత్యపారాయణానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నల్లగొండ తులసీనగర్లోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన పారాయణానికి అధిక సంఖ్యలో భక్తులు, హనుమాన్ దీక్షస్వాములు, తెలంగాణ జాగృతి సభ్యులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు చంద్రశేఖరశర్మ, జి.హరీశ్శర్మ, హనుమంతాచార్యులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్, కొండగట్టు అంజన్న సేవా సమితి జిల్లా సమన్వయకర్త బోనగిరి దేవేందర్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్నకు 11కోట్ల రామకోటిని నివేదించాలని లక్ష్యంతో కొండగట్టు అంజన్న సేవా సమితి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నేలపట్ల రమేశ్, ధర్మకర్తలు కూరెళ్ళ రమణాచారి, రుపేందర్, మేనేజర్ రుద్ర వెంకటేశం, కౌన్సిలర్లు పిల్లి రామరాజు, అభిమన్యు శ్రీనివాస్, తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ బొమ్మ శంకర్, పీఆర్ఓ వెంకట్, కోశాధికారి మేక విఘ్నేశ్వర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కటకం వెంకటాచారి, లింగంగౌడ్, శ్రీను, గోవిందు, జి.శేఖర్, గోదాదేవి పాల్గొన్నారు.