రోడ్డు ప్రమాదాలంటేనే ముందుగా గుర్తొచ్చేది అతి వేగం. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎదుటివారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నారు. వాహనాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత వేగంతో దూసుకుపోయేలా చేస్తున్నది. ఈ నేపథ్యంలో అతివేగాన్ని నియంత్రించేందుకు ఇప్పటివరకు అక్కడక్కడా స్పీడ్ గన్స్, స్పీడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. వీటి స్థానంలో ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆటోమెటిక్ స్పీడ్ డిటెక్ట్ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా హైవే పొడవునా వాహన వేగంపై కెమెరా కన్ను ఉంటుంది. ఎక్కడైనా అదనపు వేగంతో ప్రయాణిస్తే జరిమానా తప్పదు. దీని వల్ల వాహనాల అదనపు వేగానికి దాదాపుగా అడ్డుకట్ట పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ టెక్నాలజీని ముందుగా దేశంలోనే అతి రద్దీ రహదారుల్లో ఒకటైన విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నారు. ఇక్కడి అనుభవనాలను బట్టి రానున్న కాలంలో ఇతర హైవేలపైనా వినియోగించనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్22 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా హైవేలపై ప్రయాణం అంటేనే వాహనాలు రయ్య్మ్రని దూసుకుపోవడం చూస్తుంటాం. కొందరైతే అడ్డూ అదుపులేని వేగంతో వాహనాలను నడుపుతుంటారు. తొందరగా వెళ్లాలన్న ఆత్రుతతో పరిమితికి మించిన వేగంతో పోతుంటారు. దారిలో ఏదైనా అడ్డొస్తే నియంత్రణ తప్పి ప్రమాదాలకు గురువుతుంటారు. వీరితో పాటు ఎదుటి వాహనదారులు కూడా ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. మామూలుగా చిన్న కార్లు సైతం గంటకు 100కిలోమీటర్ల వేగంతో దూసుకు పోతున్నాయి. ఇక పెద్ద వాహన దారులైతే కొన్నిసార్లు 120 నుంచి 150కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. అయితే వీటి వేగ నియంత్రణకు రెగ్యులర్గా చెక్ పెట్టే అయితే ఇప్పటివరకు కనిపెట్టలేదు. ప్రస్తుతం హైవేలపై స్పీడ్ గన్లను రోడ్డు మధ్యలో లేదా పక్కన పెట్టి వాహనాల వేగాన్ని లెక్కిస్తున్నారు. పరిమితికి మించి వేగంతో వెళ్తే ఈ-చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే విజయవాడ-హైదరాబాద్, నార్కట్పల్లి-అద్దంకి, వరంగల్-హైదరాబాద్ హైవేలపై ఇవి అప్పుడప్పుడు మాత్రమే వేగాన్ని చెక్ చేస్తుంటాయి. కొన్ని చోట్ల స్పీడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేసినా వీటిని రెగ్యులర్గా మానిటరింగ్ చేయలేకపోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మనిషిని ఏర్పాటు చేసి వేగాన్ని లెక్కించాల్సి ఉంటుంది. దీంతో పాటు హైవేపై ఎక్కడో ఓ చోట మాత్రమే ఇలా స్పీడ్ గన్ను ఏర్పాటు చేస్తారు. స్పీడ్ గన్ ఉందని తెలిసిన చోట వాహనం స్లో చేసి తర్వాత ఇష్టమున్నట్లు ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ వ్యవస్థతో అంతగా ఫలితం లేకుండా పోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన మరో వ్యవస్థకు రూపకల్పన చేశారు.
పని చేసే విధానం ఇలా..
ఈ కెమెరాలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ద్వారా పనిచేస్తాయి. రోడ్డుపై ఒక చోట ఆటోమెటిక్ స్పీడ్ డిటెక్ట్ కెమెరాను ఏర్పాటు చేస్తారు. దాని నుంచి కొంత దూరంలో మరో కెమెరా ఉంటుంది. ఈ రెండు కెమెరాల మధ్య దూరాన్ని చేరుకోవడానికి నిర్ణీత సమయాన్ని ముందే ఫిక్స్ చేస్తారు. ఈ సమయానికంటే ముందే అక్కడికి చేరుకుంటే అదనపు వేగంతో ప్రయాణించినట్లుగా లెక్కించి జరిమానా విధిస్తారు. ఒక ప్రాంతం నుంచి మరో చోట కెమెరా ఏర్పాటు చేసిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరం ఉంటే మొదటి కెమెరా ఒక వాహనం వెళ్లిన స్పీడ్ను రికార్డు చేస్తుంది. ఆ తర్వాత రెండో కెమెరా ఉన్న ప్రాంతానికి ఆ వాహనం చేరిన సమాయాన్ని రికార్డు చేస్తుంది. ఈ రెండు కెమెరాల మధ్య ఆ వాహనం ప్రయాణించిన మొత్తం దూరం, పట్టిన సమయాన్ని బట్టి ఆ వాహనం ఎంత వేగంగా ప్రయాణించిందనేది స్పష్టం కానుంది. అంటే ఆ వాహనం నిమిషానికి 1 కిలోమీటర్ వేగంతో 20 కిలోమీటర్ల వేగాన్ని 20 నిమిషాల్లో చేరితే ఆ వాహనం గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించినట్లుగా లెక్క. అదే వాహనం 10 నిమిషాల్లోనే మొదటి కెమెరా నుంచి రెండో కెమెరా వరకు ప్రయాణిస్తే ఆ వాహనం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అంచనా వేస్తారు. ఇలా లెక్కించిన అతి వేగానికి ఆటోమెటిక్గా ఈ-చాలాన్ జనరేట్ అవుతుంది. దీన్ని సంబంధిత వాహనం నెంబర్తో లింకై ఉన్న ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారు. ఈ సిస్టంలో హైవే పొడవునా వీలైనన్నీ ఎక్కువ ప్రాంతాల్లో కెమెరాలు అమర్చడం ద్వారా దాదాపు వాహనాల అతి వేగానికి బ్రేక్ పడినట్లే. దీంతో అతి వేగంతో జరిగే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అటు పోలీసు శాఖ, ఇటు రోడ్డు ట్రాన్స్పోర్టు అథారిటీ అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం రానున్న కాలంలో ఇతర హైవేలకి విస్తరించే అవకాశాలున్నాయి.
అత్యాధునిక టెక్నాలజీ…
జాతీయ రహదారులపై ప్రస్తుతం ఉన్న స్పీడ్ గన్ల స్థానంలో ఆటోమెటిక్ స్పీడ్ డిటెక్ట్ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వీటిని పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే రానున్న రెండు నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆటోమెటిక్ కెమెరాలు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం(ఐటీఎంఎస్) ద్వారా పని చేస్తాయి. వీటిని నిర్ణీత దూరంలో అమరుస్తారు. హైవేలపై ఎక్కువ ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలతో పాటు గ్రామాలు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనూ వీటిని విరివిగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కడికక్కడే వాహనవేగానికి కళ్లెం పడనుంది. నిర్ణీత సమయానికి మించి మరో కెమెరా వద్దకు వాహనం చేరుకుంటే నేరుగా చలాన్ జనరేట్ కానుంది.
త్వరలోనే అందుబాటులోకి
అతివేగమే ఎక్కువ ప్రమాదాలకు కారణం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ సిస్టంను రూపొందించారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో పనిచేసే ఆటోమేటిక్ స్పీడ్ డిటెక్ట్ కెమెరాలు రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రధాన హైవేపై పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపడుతున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా హైవేలో ఎక్కడా పరిమిత వేగాన్ని మించే అవకాశం ఉండదు. ఒక కెమెరాకు ఇంకో కెమెరాకు మధ్య దూరాన్ని, వాహనం చేరుకున్న సమయాన్ని ఆధారంగా జరిమానాలు విధిస్తారు. దీంతో కెమెరాలు లేని చోట స్పీడ్గా వెళ్లి కెమెరాలు ఉన్న చోట స్లో కావడానికి అవకాశం లేదు.