తెలంగాణ భవన్లో విజయ గర్జన సన్నాహక సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేదికపై మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి, జడ్పీచైర్మన్ సందీప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల, తదితరులు
‘ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏర్పాటే ఓ సాహసోపేత నిర్ణయం. అప్పట్లో టీఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్నా.. 20 వసంతాల్లోనే పార్టీ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నది.. అందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దక్షతనే కారణం.. ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీకి కేసీఆర్ మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు.. అందు కోసం కనీవిని ఎరుగని రీతిలో వరంగల్ విజయగర్జన బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం.. ఈ సభకు ఊరూవాడ కదలిరావాలి.. విజయ గర్జనలో కదం తొక్కాలి.. అందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, తర్వాత మండల, పట్టణ, గ్రామ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ కదిలేలా కార్యాచరణ జరగాలి.. ఇక ముందు పార్టీ నేతలు, క్యాడర్కు చేతినిండా పని ఉంటుంది.. గర్జన అనంతరం స్వయంగా అధినేత కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకుందాం.. తర్వాత పార్టీ శ్రేణులకు సైతం శిక్షణా తరగతులు ఉంటాయి.. పార్టీనే సుప్రీం అనేలా నిరంతరం కార్యాచరణ ఉంటుంది’ అని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 15వ తేదీన వరంగల్లో జరుప తలపెట్టిన తెలంగాణ విజయగర్జన బహిరంగసభపై గురువారం తెలంగాణ భవన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత వహించగా ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ నవంబర్ 15న వరంగల్లో జరుప తలపెట్టిన ‘తెలంగాణ విజయగర్జన సభ’ను విజయవంతం చేసేందుకు ఊరూవాడ కదలి రావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. పార్టీ ఏర్పాటై 20సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ద్వి దశాబ్ది ఉత్సవాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. అయితే, విజయగర్జనకు ముందు హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ నెల 25న జరిగే ఫ్లీనరీకి ఎంపిక చేసిన ప్రతినిధులంతా తరలిరావాలని కోరారు. ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ప్లీనరీ అనంతరం వరంగల్ విజయగర్జన సభపైనే పార్టీ యావత్తు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీతో పాటు వరంగల్ విజయగర్జన సభ నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా తరఫున మంత్రి జగదీష్రెడ్డి సారథ్యం వహించగా నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, భువనగిరి, ఆలేరు, కోదాడ నియోజవర్గాల నుంచి నాయకులు హాజరయ్యారు. వారిలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లతో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా విజయగర్జన సభ విజయవంతంపై యువ నేత కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సుమారు 45 నిమిషాలకు పైగా సాగిన కేటీఆర్ ప్రసంగంలో అనేక విషయాలపై పార్టీ ప్రాధాన్యతల గురించి స్పష్టంగా వివరించారు. విజయగర్జన బహిరంగసభ విజయవంతంపైనా దృష్టి సారించాలని, ఈ నెల 25లోపే మండల, పట్టణ స్థాయిల్లో నూతనంగా ఎంపికైన గ్రామ, వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సభ ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామ, వార్డు స్థాయి వరకు ఎలా దీన్ని తీసుకెళ్లాలో అవగాహన కల్పించాలన్నారు. విజయగర్జన సభ సక్సెస్ ప్రధాన ఎజెండాగా ఈ నెల 27న అంతటా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, పార్టీ ఏర్పాటయ్యాక ఇప్పటివరకు సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఇక ముందు ప్రజాప్రతినిధులు సైతం పార్టీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని, పార్టీ లేనిదే పదవులు లేవన్న అవగాహనతో ప్రతి ఒక్కరూ ఉండాలని పేర్కొన్నారు. పార్టీ పట్ల అంకితభావం, పట్టుదలతో పాటు చురుకుగా పనిచేస్తేనే మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఉమ్మడి నల్లగొండలోని మూడు జిల్లా కేంద్రాల్లో నూతనంగా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి కావచ్చిందని, త్వరలోనే అధినేత కేసీఆర్ చేతుల మీదుగా స్వయంగా ప్రారంభించుకుందామన్నారు. పార్టీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాక నేతలకు, శ్రేణులకు శిక్షణా తరగతులు కూడా ఉంటాయన్నారు. ఇక నుంచి పార్టీ నేతలకు, క్యాడర్కు చేతినిండా పని ఉంటుందని, ఏ ఒక్కరినీ ఊరికే ఉండనివ్వమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలాది పార్టీలు పుట్టినా నిలదొక్కుకున్నది రెండే రెండు పార్టీలు అని, అందులో మొదటి తెలుగుదేశం కాగా రెండోది టీఆర్ఎస్ పార్టీనే అని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ప్రాంతీయ పార్టీగానే ఆవిర్భవించినా… 13 ఏండ్లల్లోనే ఉద్యమ లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడమే కాకుండా తొలి, మలి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిన ఘనత దక్కిందన్నారు. దీనంతటికీ పార్టీ అధినేత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతే కారణమని స్పష్టం చేశారు. సమావేశానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో పాటు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, ఇ.రాంచందర్నాయక్, మోతె పిచ్చిరెడ్డి, గంగుల కృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సమన్వయంతో విజయవంతం చేస్తాం…
ప్లీనరీ, విజయగర్జన సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తాం.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. కార్యకర్తలు, పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తూ రెండు సభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తాం. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి. మున్సిపాలిటీలోని ప్రజా సమస్యల కోసం ప్రజాప్రతినిధులు పూర్తి సమయం కేటాయించాలని మంత్రి కేటీఆర్ చేసిన సూచన తూ.చ.తప్పకుండా పాటిస్తాం.
శక్తివంచనలేకుండా శ్రమిస్తాం…
ప్లీనరీతోపాటు టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు శక్తివంచనలేకుండా శ్రమిస్తాం. ఉత్సవాలకు సన్నద్ధం కావాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుదీర్ఘంగా వివరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని సూచించారు. ఆయన సూచించిన మార్గంలో నడిచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం.
కేటీఆర్ ప్రసంగంతో నూతనోత్సాహం
కేటీఆర్ ప్రసంగంతో నూతనోత్సాహం కలిగింది. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్.. నేడు దేశంలోనే అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఎంతో మంది యువత టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు యాదగిరిగుట్ట పార్టీ కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారు.
అదిరేలా ద్విదశాబ్ది ఉత్సవం
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 20వ వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేస్తాం. ఉత్సవాలు అదిరేలా నిర్వహించేందుకు మంత్రి కేటీఆర్ చేసిన సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తాం.
మరో 20 ఏళ్లు టీఆర్ఎస్దే అధికారం
టీఆర్ఎస్ పార్టీ మరో 20 ఏండ్ల పాటు అధికారంలో ఉంటుందని కేటీఆర్ ప్రసంగంతో నమ్మకం కలిగింది. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా కృషి చేస్తాం. ద్విదశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేస్తాం.