గిరిజన రైతులను వ్యవసాయ రంగంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న కమతాలున్న రైతులకు సేద్యం కోసం నీటి వసతి కల్పించేందుకు గిరిజన వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఐదెకరాల్లోపు భూములున్న గిరిజన రైతులకు ఉచితంగా వంద శాతం రాయితీతో బోరు మోటర్లు ఏర్పాటు చేయనున్నది. పేద గిరిజన రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించే ఈ పథకానికి అర్హుల ఎంపిక కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయానికి దూరంగా ఉన్న గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు గిరిజ న వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో ఇందిర జలప్ర భ పథకం ఉండగా.. ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరలేదు. దీంతో ఈ పథకం స్థానంలో కొత్తగా గిరివికాసం పేరుతో నీటి సౌకర్యం లేని పేద గిరిజన రైతుల భూములకు బోర్లు వేయించనున్నారు. ఐదెకరాల్లోపు భూములున్న గిరిజన రైతులకు ప్రభుత్వమే వంద శాతం రాయితీతో ఉచితంగా బోర్లు ఏర్పాటు చేయనున్నది. దీనికిగానూ మండల స్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే, ఈ పథకంపై తగిన ప్రచారం లేకపోవడంతో గిరిజన రైతులు ఎక్కువ సంఖ్యలో ముందుకు రావడం లేదు. డీఆర్డీఏ అధికారులు ఇతర పథకాల మాదిరిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. బీడు భూములు ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదెకరాలకంటే తక్కువ భూములు ఉన్న గిరిజన రైతులే అర్హులు. అయితే, అత్యధిక గిరిజనులకు ఒకటి, రెండెకరాల్లోపే భూములు ఉంటాయి. దీంతో ఇద్దరు, ముగ్గురు రైతులున్నా ఒక బృందంగా బోరు వేసేందుకు డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. అర్హులైన రైతులు ఎంపీడీవో, తాసిల్దార్లు, ఐటీడీఏ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకొని దరఖాస్తులు చేసుకోవాలి. వీటిని అధికారులు పరిశీలించి కలెక్టర్కు నివేదిస్తారు. ఎంపికైన రైతులకు వంద శాతం రాయితీతో బోరు మోటరు ఏర్పాటు చేయనున్నారు. బోరు పంపు లోతు, విద్యుత్ సరఫరా చేసే తీరును బట్టి ఒక్కో యూనిట్కు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ప్రభుత్వమే భరించనున్నది. ముందుగా భూగర్భ జలవనరుల శాఖకు చెందిన జియాలజిస్ట్ బోర్ పాయింట్ను ఎంపిక చేస్తారు. అక్కడ నీళ్లు పడే అవకాశం ఉంటే అధికారులకు సూచిస్తారు. ఆ తర్వాత బోరుకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. స్తంభాలు, వైర్లు బిగిస్తారు.
నాగర్కర్నూల్ జిల్లాలో గిరివికాసం పథకంలో భాగంగా 149 యూనిట్లను గుర్తించగా.. ఇప్పటివరకు 145 ప్రాం తాల్లో బోర్లు వేసేందుకు ఎంపిక చేశారు. మండల కమిటీల ద్వారా 101 యూనిట్లకు అనుమతులు వచ్చాయి. దీనికి గానూ రూ.2.29 కోట్లు మంజూరయ్యాయి. ఇంతకు ముం దున్న ఇందిర జలప్రభ ద్వారా జిల్లాలో రూ.1.69 కోట్ల పనులకుగానూ రూ.60.54 లక్షలతో బోర్లు వేశారు. మొత్తమ్మీద గిరిజన వికాసం పథకం పేద గిరిజన రైతులకు వరంగా మారనున్నది. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన బ్లాక్లో బోర్లు వే యించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఐదెకరాల్లోపు ఉంటే ఉచితంగా బోర్లు..
గిరిజన వికాసం పథకంతో ఐదెకరాల లోపు ఉన్న గిరిజన రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయనున్నాం. తొలి దశలో బోరు వేసే పాయింట్ను గుర్తించి, నీళ్లు పడతాయంటే విద్యుత్ కనెక్షన్లు ఇస్తాం. ఆ తర్వాత మోటర్ల బిగింపు ఉంటుంది. జిల్లాలో అర్హులైన గిరిజన రైతులు ఈ పథకం కోసం ధ్రువీకరణ పత్రాలతో మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.