జూనియర్ కళాశాలలకు అతిథులు వచ్చారు. కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గెస్ట్ లెక్చరర్లను నియమించారు. అయితే పాత వారినే రెన్యువల్ చేయడంతో నాగర్కర్నూల్ జిల్లాలో 62 మంది అతిథి అధ్యాపకులు విధుల్లో చేరారు. ఒక్కో తరగతికి రూ.300 చొప్పున నెలకు రూ.21,600 వేతనం అందించనున్నారు. వీరితోపాటు 95 మంది కాంట్రాక్ట్, 16 మంది రెగ్యులర్ అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో అధ్యాపకులు చేరడంతో ఇక ఇంటర్ విద్య మరింత గాడిన పడనున్నది. సర్కారు నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో నెలన్నర రోజులుగా ఖాళీగా ఉన్న స్థానాల్లో నూతన అధ్యాపకులు రావడంతో ప్రభుత్వ ఇంటర్ విద్య ఇక గాడిన పడనున్నది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలుగా విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో నెలన్నర కిందట విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం పూర్తి స్థాయిలో బోధన జరగడం లేదు. ప్రారంభం నుంచి రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులచే చదువు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేకపోవడంతో ఆయా సబ్జెక్టుల బోధన ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇంటర్ విద్య ఆశించినంతగా సాగడం లేదు. కళాశాల అధ్యాపకులు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి తమ కాలేజీల్లో బోధన తీరు, సౌకర్యాలు, ప్రభుత్వ సాయం వివరించడంతో విద్యార్థులు భారీగా చేరారు. కాగా, పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేకపోవడంతో ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి ముఖ్యమైన సబ్జెక్టులను బోధించే అధ్యాపకుల కొరత ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇటీవల గెస్ట్ లెక్చరర్లు విధుల్లో చేరారు. గత విద్యా సంవత్సరంలో విధులు నిర్వహించిన పాత గెస్ట్ లెక్చరర్లనే నియామకం చేశారు. ఇప్పటికే ఆయా కళాశాలలపై అవగాహన ఉన్న లెక్చరర్లచే పాఠ్యాంశాల బోధన చేయిస్తుండడంతో చదువులో నాణ్యత రానున్నది. ఫలితంగా ఇంటర్ విద్య గాడిన పడనున్నది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో మొదటి ఏడాది పూర్తి చేసుకున్న వారు ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తూనే.. ఫస్టియర్ పరీక్షలకు హాజరవుతుండడం గమనార్హం. గెస్ట్ లెక్చరర్లకు ఒక్కో తరగతికిగానూ రూ.300 చొప్పున.. నెలకు రూ.21,600 వేతనంగా చెల్లించనున్నది. 2012 నుంచి గెస్ట్ లెక్చరర్లు విధుల్లో ఉంటున్నారు. గతంలో ఒక్కో తరగతికి రూ.150 చొప్పున చెల్లించగా, తెలంగాణ వచ్చాక మరో రూ.150 చొప్పున పెంచారు. ఇలా ప్రభుత్వం ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విధుల్లో గెస్ట్ లెక్చరర్లు..
నాగర్కర్నూల్ జిల్లాలో 24 ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో.. కొత్తగా 62 మంది గెస్ట్ లెక్చరర్లు విధుల్లో చే రారు. గతంలో పని చేసిన అధ్యాపకులనే రెన్యువల్ చేశాం. వీరితోపాటు 95 మంది కాంట్రాక్ట్, 16 మంది రె గ్యులర్ అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన పదోన్నతు లు, కొందరి మృతితో మరో 14 మంది అదనపు లెక్చరర్ల పోస్టుల భర్తీ కో సం నివేదించాం. ఈ విద్యా సంవత్సరంలో పాఠ్యాంశాల బోధన వంద శాతం జరిగేలా చర్యలు తీసుకుంటాం.