కోహిమా: నాగాలాండ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ఆంక్షలను మరింత పొడిగించింది. ఇప్పటికే విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 18తో ముగియనుండటంతో మరో 12 రోజులు లాక్డౌన్ పొడిగిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫియూ రియో నేతృత్వంలో కొవిడ్-19పై ఏర్పాటైన హై పవర్డ్ కమిటీ ఇవాళ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతున్నప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించామని నాగాలాండ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మహోన్లుమో కికోన్ తెలిపారు. కాగా, గత నెల 14వ తేదీ నుంచి నాగాలాండ్లో లాక్డౌన్ పొడిగించడం ఇది వరుసగా నాలుగోసారి.