ఇటీవల చిన బంగార్రాజుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ చైతన్య (Naga Chaitanya) తమిళ రీమేక్ లో నటించబోతున్నాడు. కోలీవుడ్ (kollywood)లో శింభు (simbu) హీరోగా తెరకెక్కిన మానాడు (Maanaadu) సినిమాను తెలుగులో పునర్నిర్మించబోతున్నారు. ఈ రీమేక్లో నాగ చైతన్య హీరోగా నటిస్తారని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కి గతేడాది విడుదలైన మానాడు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెలుగు నిర్మాతల నుంచి గట్టి పోటీనే ఎదురైంది.
మానాడు రీమేక్ రైట్స్ కోసం జరిగిన పోటీలో సురేష్ బాబు సినిమా హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమాను రానా హీరోగా రీమేక్ చేయాలని ఆయన భావించారు. అయితే తాజాగా రానా కంటే నాగ చైతన్య అయితే ఈ కథకు బాగా సరిపోతాడని నిర్మాత భావించారు. నాగ చైతన్య కూడా మానాడు రీమేక్ లో నటించేందుకు ఆసక్తికరంగా ఉన్నారట.
మానాడు సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు రీమేక్కు దర్శకత్వం వహిస్తారా..? లేదా..? అనేది చూడాలి. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. మాతృక దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహించకుంటే మరో దర్శకుడుకి ఆ అవకాశం వెల్లేలా ఉంది.
ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నారు నాగ చైతన్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఓ వెబ్ సిరీస్ లోనూ నటించేందుకు ఒప్పుకున్నారు. వీటి తర్వాత మానాడు కూడా చైతూ లిస్టులో చేరనుంది. మానాడు రీమేక్ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.