హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): చదువొచ్చినా, రాకున్నా నైపుణ్యం ఉంటే ఉపాధి కచ్చితంగా దొరుకుతుంది. ఉపాధి దొరకాలంటే నైపుణ్యం ఉండాల్సిందే. అంతటి నైపుణ్యాన్ని అందించి, ఉపాధి కూడా చూపిస్తున్నది.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(న్యాక్). శిక్షణ-ఉద్యోగం ట్యాగ్లైన్గా, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ శిక్షణ సంస్థ.. ఏటా 20 వేల మందికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. కొవిడ్లోనూ 16 వేల మందికి శిక్షణ ఇచ్చింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి, వచ్చిన వారికి కూడా శిక్షణ ఇచ్చి, ఇక్కడే పని కల్పించింది. మన దగ్గర ఏర్పాటైన న్యాక్లో శిక్షణ తీరును తెలుసుకొని కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యుపీ అధికారులు స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. న్యాక్లో ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ యూనివర్సిటీని ఏర్పాటుచేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక న్యాక్కు 11 అవార్డులు వచ్చాయి. 2019లో ప్రతిష్ఠాత్మక అసోచాం సంస్థ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ గోల్డ్ విన్నర్ అవార్డు ఇచ్చింది.
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమేకాక, పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన కార్మికులను న్యాక్ అందిస్తున్నది. తమకు నైపుణ్యం కలిగిన కార్మికులను తయారుచేసి ఇవ్వాలని న్యాక్తో పేరు పొందిన 360 సంస్థలు ఎంవోయూ కుదుర్చుకొన్నాయంటే ఇక్కడ ఇచ్చే శిక్షణపై ఎంతటి నమ్మకమో తెలుస్తున్నది. ఆయా కంపెనీలు న్యాక్లో ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశాయి. 1998లో న్యాక్ ఏర్పడినప్పటి నుంచి 4,35,122 మందికి శిక్షణ, ఉద్యోగాలు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1,05,407 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించింది.
రాష్ట్రంలో మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లకు భారీ డిమాండ్ ఉన్నది. ఈ రంగాల్లో పని నేర్చుకొన్నవాళ్లకు సీనియారిటీ పెరుగుతున్నకొద్దీ ఆదాయం పెరుగుతున్నది. రోజుకు రూ.1000 తగ్గకుండా వేతనం ఇచ్చి పని చేయించుకొంటున్నారు. న్యాక్లో శిక్షణ తీసుకొన్న చాలామంది మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డైవాల్ ఫాల్ సీలింగ్వాళ్లు కొద్దికాలం తర్వాత కాంట్రాక్టులు తీసుకొని పనిచేస్తున్నారు. డై వాల్ ఫాల్ సీలింగ్లో న్యాక్లో శిక్షణ తీసుకొన్న సంగారెడ్డి జిల్లాకు చెందిన రాజిరెడ్డి ఇండియన్ స్కిల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించాడని, 2019లో వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లో పాల్గొన్నాడని న్యాక్ తెలిపింది.
శిక్షణ తీసుకొన్న వారందరికీ ప్లేస్మెంట్ ఇప్పించేందుకు న్యాక్లో ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన నిత్యం ఆయా కంపెనీలతో సంబంధాలు కొనసాగిస్తూ ఆయా కంపెనీల ప్రతినిధులను న్యాక్కు తీసుకొస్తుంటారు. శిక్షణ ఇచ్చే సమయంలోనే కంపెనీల నిపుణులతో ఆయా పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పిస్తారు. న్యాక్ అభ్యర్థులను కంపెనీలకు తీసుకెళ్లి పని ఎలా చేయాలో చూపిస్తారు.
కార్మికశాఖ అధికారుల ద్వారా జిల్లాలు, గ్రామాల్లోని నిరుద్యోగులను గుర్తించి, వారిని తీసుకొచ్చి ఉచితంగా భోజనం, వసతి కల్పించి శిక్షణ ఇస్తారు. రెండు వారాల నుంచి 3 నెలల వరకు శిక్షణ ఇచ్చే కోర్సులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ తీసుకొన్నవారికి శిక్షణ కాలంలో రోజుకు రూ.350 ైస్టెపెండ్ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికెట్ ఇస్తుంది. ప్రతి నెల 1న,16న కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఒక బ్యాచ్లో 30 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకొనేవారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సమితి ఫండింగ్ చేస్తుంది. అలాగే భవన నిర్మాణ కార్మికుల కుటుంబసభ్యులకు, ముఖ్యంగా మహిళలకు కుట్టుమిషన్లో శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు ఈ ఏడాది 2,400 మందికి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఇక్కడ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులందరికీ ప్లేస్మెంట్లు వచ్చాయి. ఈ ఏడాది 96 మంది బీటెక్ విద్యార్థులు పీజీ డిప్లొమా పూర్తి చేయగా, 46 మందికి జీహెచ్ఎంసీలోని పలు ప్రాజెక్టులలో సైట్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. మరో 50 మంది వివిధ కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు.