మహబూబ్నగర్ : మీరు చదువుకున్న బడిని బాగు చేయదలుచుకున్నారా? మీరు చదువుకున్న బడి అంటే మీకు ఇష్టమా? అయితే బడి బాగు కోసం మీ వంతు సహకారం అందించాలనుకుంటున్నారా? చదువుకున్న బడి రుణం తీర్చుకోవడానికి “నా బడి కోసం” మొబైల్ యాప్ సిద్ధంగా ఉందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ, జిల్లా ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన నా బడి కోసం మొబైల్ యాప్ ను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
జిల్లాలోని పాఠశాలల బాగు కోసం గతంలో ఇంటింటికీ వంద.. బడికి చందా కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన విషయాన్ని కలెక్టర్ గుర్తుచేశారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు “నా బడి కోసం” మొబైల్ యాప్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు, విదేశాలు, పట్టణాలు, నగరాలలో, ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారు చదివిన పాఠశాల బాగు కోసం ఏదైనా విరాళాలను ఇవ్వదలిస్తే “నా బడి కోసం” మొబైల్ యాప్ ద్వారా వారు ఉన్నచోటి నుండి విరాళాలను పంపవచ్చని తెలిపారు.
ఇలా వచ్చిన విరాళాలతో పాఠశాలల కోసం ప్రత్యేకించి పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తామన్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం పాఠశాలలు మూసి వేసినప్పటికి రాబోయే రోజుల్లో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు వంటివి తప్పనిసరి అవసరం అవుతాయని, విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్వ విద్యార్థులు ఇచ్చే ఆర్థిక సహకారం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం అయిన తరువాత మొదటి ప్రాధాన్యత శానిటైజర్, మాస్కులు, కుర్చీలు, బెంచీలతో పాటు, ఇతర సౌకర్యాలకు ఉపయోగకరంగా ఉండేలా ఈ విరాళాలు ఉపయోగపడతాయని చెప్పారు.
అందువల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గతంలో విద్యనభ్యసించి ప్రస్తుతం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలు ,నగరాలలో విద్యావేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, సమాజంలో మంచి ఉన్నత హోదాలో ఉన్న వారందరూ వారు చదివిన పాఠశాల కోసం తమ వంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పాఠశాలల బాగు కోసం ప్రత్యేకించి “నా బడి కోసం” మొబైల్ యాప్ ను తీసుకురావడంలో కృషిచేసిన జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి ,రాష్ట్రస్థాయి అధికారి శివాజీ తదితరులను కలెక్టర్ అభినందించారు. విద్యాశాఖ అధికారి ఉషా రాణి, ఈ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.