నైపిడావ్: విమానం గాల్లో ఎగురుతుండగా ఒక బుల్లెట్ దానిలోకి చొచ్చుకొచ్చింది. ఆ బుల్లెట్ ఒక ప్రయాణికుడికి తగలడంతో గాయపడ్డాడు. సైనిక పాలన ఉన్న మయన్మార్లో ఈ సంఘటన జరిగింది. మయన్మార్ నేషనల్ ఎయిర్లైన్స్ విమానం లోయికావ్ ఎయిర్పోర్ట్కు నాలుగు మైళ్ల దూరంలో 3,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్నది. ఇంతలో ఒక బుల్లెట్ విమానం కింది భాగం నుంచి లోపలకు చొచ్చుకొని వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి శరీరంలోకి అది దిగింది. లోయికావ్ ఎయిర్పోర్ట్లో ఆ విమానం ల్యాండ్ అయిన వెంటనే గాయపడిన ప్రయాణికుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ నగరానికి వచ్చే అన్ని విమానాలను మయన్మార్ నేషనల్ ఎయిర్లైన్స్ నిరవధికంగా రద్దు చేసింది.
కాగా, కయాహ్ రాష్ట్రంలోని తిరుగుబాటు దళాలు ఆ విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఆరోపించింది. ప్రయాణికుల విమానంపై ఈ రకమైన దాడి యుద్ధ నేరమని మయన్మార్ పాలక మిలిటరీ కౌన్సిల్ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ తెలిపారు. శాంతి కోరుకునే వ్యక్తులు, సంస్థలు దీనిని అన్ని విధాలుగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు తిరుగుబాటు దళాలు ఈ ఆరోపణలను ఖండించాయి.