రిషికేశ్: ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరి జిల్లాలో ఈ నెల 18న ఓ రిసార్టులో పనిచేసే 19 ఏండ్ల రిసెప్షనిస్ట్ హత్యకు గురైంది. పోలీసుల దర్యాప్తులో రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య హంతకుడిగా తేలడంతో గత శుక్రవారం అతడిని, అతడికి సహకరించిన రిసార్టు మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు.
పుల్కిత్ ఆర్య తండ్రి రాష్ట్రంలో సీనియర్ బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య. అతని కొడుకుపై హత్య కేసు నమోదు కావడంతో బీజేపీ వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగించింది. ఈ క్రమంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన కొడుకును వెనకేసుకొచ్చాడు. తన కొడుకు హంతకుడు కాదని, అమాయకుడని చెప్పాడు.
ఘటనపై నిష్పాక్షిక విచారణ జరుగాలన్న ఉద్దేశంతోనే తాను పార్టీకి రాజీనామా చేశానని వినోద్ ఆర్య తెలిపాడు. కేసులో తన కొడుకు పుల్కిత్ ఆర్యకు, మృతురాలు అంకితా భండారీకి న్యాయం జరుగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా, రిసార్టుకు వచ్చే గెస్టులతో వ్యభిచారం చేసేందుకు నిరాకరించిందన్న కోపంతోనే పుల్కిత్, రిసార్టు ఉద్యోగులు కలిసి అంకితను చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.