హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పబ్స్ నుంచి రాత్రి పది గంటల తర్వాత డిజేలు, మైక్లు, డ్రమ్స్, మ్యూజిక్ పేరుతో శబ్ద కాలుష్యం వెలువడకూడదన్న గత ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెవులు చిల్లులు పడేలా శబ్ద కాలుష్యం వెలువడే పబ్స్పై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో పబ్స్కు అనుమతులు మంజూరు చేసినప్పుడు విధించిన నిబంధనలు అమలు అవుతున్నాయో లేదో నివేదించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
గతంలోని హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత.. పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. వినోద కార్యక్రమాల నిబంధనల మేరకు అనుమతులు లేకుండా ఆటలు, పాటలు, సంగీత కార్యక్రమాలను నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాంటి వాటిని నిలిపివేయాలన్నారు. వినోద నిబంధనల ప్రకారం బార్, పబ్ల నిర్వహణకు అనుమతులు, వాటి ఉల్లంఘనలపై సమగ్ర వివరాలతో నివేదికలను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ, పోలీసులను ఆదేశించారు.
తమ ఇళ్ల ముందు వాహనాల్ని పార్కింగ్ చేస్తున్నారని, రాత్రిళ్లు పబ్స్ నుంచి చెవులు చిల్లులుపడే సౌండ్స్ ఉంటున్నా అధికారులు చర్యలు లేవంటూ జూబ్లీహిల్స్ రెసిడెంట్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. సుభాష్రెడ్డి సహా ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం నాడు హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పబ్స్పై చర్యలు తీసుకున్నట్లు కమిషనర్లు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశారు.
సైబరాబాద్లో 34, రాచకొండలో 2 చొప్పున పబ్స్ ఉంటే వీటిలో లౌడ్ స్పీకర్లు వాడేందుకు పర్మిషన్లు ఇవ్వలేదన్నారు. ఒకవేళ లౌడ్ స్పీకర్ పెట్టుకోవాలంటే తమ నుంచి పర్మిషన్ పొందాలన్న నిబంధన ఉందన్నారు. జీహెచ్ఎంసీ న్యాయవాది స్పందిస్తూ, వ్యాపార లైసెన్స్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార నిర్వహణకు వీల్లేదన్నారు.
రాత్రి పది గంటల తర్వాత సౌండ్ వెలువడితే కాలుష్య, పర్యావణ చట్టాలకు వ్యతిరేకమన్నారు. పబ్స్లు, బార్లను నివాస గృహాలకు 500 మీటర్ల లోపు అనుమతి ఇవ్వరాదన్న నిబంధనకు వ్యతిరేకంగా ఎక్సైజ్ శాఖ అనుమతి ఇస్తోందని చెప్పారు. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని న్యాయమూర్తి ప్రకటించారు.