చెన్నై
:
కరోనా మహమ్మారి వంటి కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులను ఆరంభంలోనే ఎదుర్కొని, వాటితో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. హఠాత్తుగా, మునుపెన్నడూ చూడని సమస్యలు, మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో మనమెంతటి అప్రమత్తత ప్రదర్శించాలనే అంశాన్ని కరోనా నేర్పించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
‘గ్లోబల్ బయో ఇండియా-2021’ సదస్సు ముగింపు సమావేశం, అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఇంటర్నెట్ ద్వారా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఇటీవల కొంతకాలంగా వివిధ పరిశ్రమలకు, రంగాలకు బయోటెక్నాలజీ వెన్నెముకగా నిలుస్తోందని పేర్కొన్నారు. పారిశ్రామిక విధానానికి నాలుగు ప్రధాన స్తంభాలైన సృజనాత్మకత, అభివృద్ధి, స్థానిక ప్రతిభ, ఉన్నత విలువల ఆధారిత సంరక్షణ వంటి ఆధారంగా నిర్మితమైన భారత బయోటెక్ రంగం, బయో ఎకానమీ దిశగా పరివర్తనం చెందుతోందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఆరోగ్య సంక్షోభాన్ని నివారించేందుకు భారత బయోటెక్నాలజీ విభాగం చేసిన కృషిని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.
బయోటెక్ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను, శక్తి సామర్థ్యాలను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలోని పారిశ్రామిక వేత్తలకు సత్వర అనుమతులతో పాటు ఇతర నిబంధనలను మరింత సులభతరం చేస్తున్నదని వెంకయ్యనాయుడు తెలిపారు. కరోనా నేపథ్యంలోనూ ఆవిష్కర్తలు, వివిధ సాంకేతికతలు, ఉత్పత్తులు పెరుగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
2025 నాటికి 150 బిలియన్ డాలర్ల లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత బయోటెక్ రంగం, దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భూమిక పోషిచేందుకు సిద్ధమవుతుందని చెప్పారు. వ్యవసాయంతో పాటు అనుంబంధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్ల విషయంలోనూ పరిష్కారాలు చూపించే సామర్థ్యం బయోటెక్నాలజీ రంగానికి ఉన్నదని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, డీబీటీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, సీఐఐ డైరక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, బయోకాన్ చైర్పర్సన్ డాక్టర్ కిరణ్ మజుందార్ షా, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్ తోపాటు పలువురు బయోటెక్ రంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, వివిధ స్టార్టప్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.