‘అవకాశాలతో సంబంధం లేకుండా పూరి జగన్నాథ్తో కలిసి ప్రయాణం చేయడాన్ని నేను ఇష్టపడతాను. నా సినిమాలకు సంబంధించి ఫలితం ఏదైనా నిర్మొహమాటంగా ఆయన చెబుతుంటారు’ అని అన్నారు సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్. ఆయన స్వరకర్తగా పనిచేసిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్పూరి, కేతిక శర్మ జంటగా నటించారు. అనిల్ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్లో సంగీత దర్శకుడు సునీల్కశ్యప్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ప్రేమ, ఆకర్షణకు మధ్య ఉన్న అంతరాన్ని చాటుతూ తెరకెక్కిన రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. బాణీలు, నేపథ్యసంగీత పరంగా వైవిధ్యతను కనబరిచే అవకాశం నాకు దొరికింది. సినిమా కోసం నేను స్వరపరచిన ‘పీనే కే బాద్’ పాట పూరి జగన్నాథ్కు చాలా నచ్చింది. ఆయనతో పాటు ఈ పాట బాగుందని చాలా మంది అభినందిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్, కేతికశర్మ ఇద్దరితో పాటలను పాడించాను. నటుడిగా ఆకాష్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. సంగీతపరంగా చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదాలు నాకు లేవు. హిైట్టెన ప్రతీదీ నా దృష్టిలో పెద్ద సినిమాగానే భావిస్తాను. నన్ను సంగీతదర్శకుడిగా తీసుకోకపోయినా పూరి జగన్నాథ్ ప్రతి సినిమాకు నేను పనిచేస్తా. ఆయనతో కలిసి సాగించే ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తా. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్లు లేవనే అసంతృప్తి లేదు. ఏం జరిగినా నా మంచికే అనుకుంటా. సానుకూల దృక్పథంతో ముందడుగువేస్తా. భవిష్యత్తులో సినిమాలకు సంగీతాన్ని అందించడంతో పాటు క్లాసికల్ మ్యూజిక్ ఆల్బమ్స్ను చేయాలనుంది. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’కు సంగీతాన్ని అందిస్తున్నా’ అని తెలిపారు.