ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల
జూన్లో నీళ్లివ్వడం ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి
గేట్ల ఆధునీకరణతో తగ్గిన లీకేజీలు
వచ్చిన వరద వచ్చినట్టే నిల్వ
రూ.63కోట్లతో కొనసాగుతున్న కాల్వల పునరుద్ధరణ
పనులు నిలిపేసి కాల్వలకు
నీళ్లు ఇవ్వాలని కోరుతున్న రైతులు
నిండుకుండలా తొణికిసలాడుతున్న మూసీ గేట్లు తెరుచుకున్నది. ప్రాజెక్టు చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా జూన్ నెలలో పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, ఉప్పొంగుతున్న వరదతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ఉదయం మూడు గేట్లు, రాత్రికి 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలారు.
సమైక్య పాలనలో తుప్పుబట్టిన క్రస్ట్గేట్లు, దెబ్బతిన్న ఎర్త్డ్యామ్తో యాసంగి, అదీ ఆరుతడి పంటలకు మాత్రమే మూసీ నీళ్లందేవి. స్వరాష్ట్రంలో మంత్రి జగదీశ్రెడ్డి కృషితో రాష్ట్ర ప్రభుత్వం రూ.19 కోట్లు వెచ్చించి నూతన గేట్లు ఏర్పాటు చేయడం వల్ల లీకేజీలు తగ్గి వచ్చిన నీరు వచ్చినట్టు నిల్వ ఉంటున్నది. రెండు పంటలకు పూర్తిస్థాయిలో నీళ్లందుతున్నాయి. వానకాలం సాగుకు ఇప్పటికే
నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు మూసీ గేట్లు ఎత్తడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలపై కొనసాగుతున్న ఆధునీకరణ పనులను నిలిపేసి ఆయకట్టుకు సాగు నీరు అందించాలని కోరుతున్నారు.
కేతేపల్లి, జూన్ 27 : మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో సోమవారం ఐదు గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్, ఏఈ ఉదయ్తో కలిసి స్విచ్ ఆన్ చేసి 3, 7, 10వ నంబర్ ఝూకస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద పెరుగడంతో అప్రమత్తమైన అధికారులు మరో రెండు 4, 8వ నంబరు గేట్లతో కలిపి మొత్తం ఐదు గేట్లను అడుగున్నర మేర ఎత్తి 4935.37 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 4935.37 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా ప్రస్తుతం 644.25(4.26 టీఎంసీలు)గా ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు. నీటి విడుదల కొనసాగుతున్నందున నదిలోకి రైతులు, జీవాల కాపరులు, మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
గేట్ల ఏర్పాటుతో లీకేజీల నివారణ
మూసీ ప్రాజెక్టు కింద సుమారు 50వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి కేవలం యాసంగిలో ఆరుతడి పంటలకు మాత్రమే సాగు నీరందించేవారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు గేట్లు తుప్పుపట్టి నీరంతా దిగువకు జాలువారేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రా జెక్టుకు నూతన గేట్లు అమర్చడంతో లీకేజీలు తగ్గి ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగింది. గత 60 ఏండ్లలో ఎ న్నడూ లేని విధంగా ఈసారి జూన్లోనే మూసీ గేట్లు ఎ త్తడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
మారిన రూపురేఖలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సరిపడా సాగునీరందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రూ. 19 కోట్లతో ప్రాజెక్టుకు నూతనంగా గేట్లను ఏర్పాటు చేశారు. ఎర్త్డ్యామ్పై బీటీ రోడ్డు వేశారు. దీంతో నీరు వృథాగా వెళ్లడం లేదు. వానకాలం సీజన్ ప్రారంభం నుంచి ఎగువ నుంచి వచ్చే ప్రతి నీటిబొట్టు ప్రాజెక్టులో నిల్వ ఉంటుంది. 2018 వానకాలం నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా వస్తున్నది. దీంతో వానకాలం, యాసంగిలోనూ రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో సుమారు 50 వేల ఎకరాల వరకు సాగునీరందుతున్నది.
కాల్వల ఆధునీకరణకు రూ.63కోట్లు మంజూరు
ప్రాజెక్టుకు నూతన గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు కుడి, ఎడమ కాల్వల ఆధునీకరణకు రూ.63 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో గతేడాది యాసంగి నీటి విడుదల పూర్తయిన తర్వాత కాల్వల ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. 2021 వానాకాలం, 2022 యాసంగిలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని అందించారు. ఈ ఏడాది యాసంగిలో నీటి విడుదల పూర్తయిన వెంటనే తిరిగి కాల్వల ఆధునీకరణ పనులను ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువల పరిధిలో నూతన డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు, గ్రామాలను కలిపే దారుల్లో కాల్వలపై నూతన వంతెనలు నిర్మించాల్సి ఉండటంతో పనులు కాస్త ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం కాల్వల ఆధునీకరణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కాల్వల పనులు నిలిపి వేసి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టు అభివృద్ధి
మూసీ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. 80 కోట్ల వరకు నిధులు ఇచ్చారు. ఈ నిధులతో ప్రాజెక్టుకు నూతన గేట్ల ఏర్పాటు చేయడం వల్ల నీటి వృథా తగ్గి జూన్లోనే పూర్తిగా నిండింది. ప్రస్తుతం కాల్వల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. నీటి విడుదలపై రైతులెవ్వరూ అధైర్యపడొద్దు. మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో త్వరలోనే ఆయకట్టుకు నీరు విడుదలయ్యేలా కృషి చేస్తాం.
– ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
అధికారుల సూచన మేరకే నీటి విడుదల
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో కాల్వలకు నీటి విడుదల కోసం రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తాం. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో ప్రసుత్తం కాలువల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 50శాతం పనులు పూర్తయ్యాయి.
– ఉదయ్కుమార్, ప్రాజెక్టు ఏఈ