హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సెలబ్రెటీల నుంచి సాధరణ జనం వరకు ఇందులో పాలుపంచుకుంటున్నారు. తాజాగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా విజయవంతంగా కొనసాగుతుందని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్కు కృతజ్ఞతలు తెలిపారు.