భోలక్పూర్లో విద్యుద్దీపాలతో ముస్తాబైన బడీ మసీదు
ప్రార్థనల్లో పాల్గొననున్న ముస్లింలు
ముషీరాబాద్/ కవాడిగూడ, మే 2: రంజాన్ సందర్భంగా భోలక్పూర్లోని మసీదులను ముస్లింలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెల రోజులుగా రంజాన్ మాసంలో ప్రతి రోజూ 5 సార్లు ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలలో ఉన్నారు. భోలక్పూర్లో దాదాపు 23 మసీదులు ఉన్నాయి. రంజాన్ మాసం ప్రారంభం కాగానే ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక దృష్టితో మసీదుల వద్ద అన్ని సదుపాయాలు కల్పించారు. డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం రంజాన్ సందర్భంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒటి గంట వరకు బడీ మసీదులో వందలాది మంది ముస్లింలు హాజరై ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు రంజాన్ వేడకలలో పాల్గొననున్నారు.
ప్రార్థనా స్థలాల వద్ద ఏర్పాట్లు..
ముషీరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు రంజాన్కు విస్తృత ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్-15 పరిధిలోని మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టారు. సర్కిల్-15 పరిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గంలోని 8 మేజర్, 12 చిన్న మసీదుల వద్ద వివిధ వసతులు కల్పించారు. రంజాన్ సందర్భంగా మసీదులకు వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండాఅవసరమైన ఏర్పాట్లు చేశారు. రోడ్లకు మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్డు నిర్మాణం, పారిశుధ్యం, మంచినీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా చెత్త తరలించడానికి పాల్తిన్ కవర్లు, డస్టుబిన్లను ఏర్పాటు చేశారు.