మర్రిగూడ/చౌటుప్పల్/సంస్థాన్నారాయణపురం, అక్టోబర్ 3: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ తగులుతున్నది. మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ 8వ వార్డు సభ్యుడు జర్పుల అర్జున్, సరంపేటకు చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ మెండు నర్సింహ యాదవ్, 3 వ వార్డు సభ్యుడు జంగిలి జంగయ్యతో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం సూర్యాపేటలోని మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
టీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు మల్లికార్జున్నగర్కు చెందిన 150 మంది, 13 వార్డులోని రాంనగర్, కృష్ణానగర్, వినాయక్నగర్ కాలనీలోని వివిధ పార్టీలకు చెందిన 250 మంది, మండలంలోని మల్కాపురం, ఎస్.లింగోటం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 140 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడ మండలం యరగండ్లపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, అంతంపేట పరిధిలోని రంగంతండాకు చెందిన 20 కాంగ్రెస్ కుటుంబాలు చౌటుప్పల్లో కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సంస్థాన్నారాయణపురం మండలం శేరిగూడేనికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు వీరేశం కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
టీఆర్ఎస్కే ఓటేస్తాం
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో చేరికల సందర్భంగా బండ సువర్ణ అనే మహిళ స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి టీఆర్ఎస్లో చేరింది. కాలనీ వాసులమంతా టీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పింది. ఈ చేరిక కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని పేర్కొన్నది. గెలిచి మూడున్నరేండ్లయినా తమ కాలనీ ముఖం చూడని రాజగోపాల్రెడ్డిని అడుగు పెట్టనియ్యబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది.