హైదరాబాద్/ సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి పటిష్ఠమై.. తిరుగులేని శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ ప్రతిపక్షాల పాలిట బాహుబలిగా మారింది. ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంటున్నకొద్దీ అధికార టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున చేరుతున్నారు. కమలం పార్టీకి గుడ్బై చెప్తూ.. గులాబీ పార్టీకి జై కొడుతున్నారు. గ్రామాలకు గ్రామాలు తీర్మానాలు చేసుకొని మరీ టీఆర్ఎస్లో చేరుతుండటం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తనదారి తాను చూసుకున్నాడని, తమకు అన్యాయం చేశాడని రగిలిపోతున్న కాంగ్రెస్ నేతలు నేరుగా వచ్చి టీఆర్ఎస్లో చేరుతుండగా.. దిగుమతి నేతతో తాము వేగలేమని, కాంట్రాక్టర్ను బీజేపీలో చేర్చుకొని పోటీచేయించడమేమిటన్న నిరసనతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు.
కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజగోపాల్రెడ్డి వెంట ఉన్న వారు కొద్దిమంది ఆయనతో పాటు బీజేపీలోకి వెళ్లారు. అనంతరం బీజేపీ విధానాలు నచ్చకపోవడం, రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయి బీజేపీలో చేరినట్టు స్వయానా ఆయనే మీడియా సాక్షిగా అంగీకరించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయన వెంట వెళ్లినవారు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఫలితంగా బీజేపీ క్రమంగా ఖాళీ అవుతున్నది. ఆ పార్టీ ప్రచారాల్లోనూ హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అత్యధికంగా కనిపిస్తున్నారు. ఇటీవల చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశాన్ని రాజగోపాల్రెడ్డి బలవంతంగా బీజేపీలో చేర్చుకున్నారు. ఆయన తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఇక రాజగోపాల్రెడ్డి తీరుతో విసిగిపోయిన చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్గౌడ్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఇక బీజేపీ సీనియర్ నేత, పలివెల సర్పంచ్ గజ్జల బాలరాజుగౌడ్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి మునుగోడు మండలంలో ప్రచారం చేస్తున్న రోజే ఆ పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎస్లో చేరారు. ఇది బీజేపీకి షాక్. పలివెల.. బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్తగారి ఊరు కూడా కావడం గమనార్హం. ఇక ఒకే రోజు అయిదు గ్రామాల సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీలో చేరి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి షాక్ ఇచ్చారు. చండూరు మండ లం కస్తాల గ్రామ సర్పంచ్ మెండి ద్రౌపదమ్మ వెంకట్రెడ్డి, నెర్మట గ్రామ సర్పంచు నందికొండ నర్సిరెడ్డి, గుండ్రపల్లి సర్పంచు తీగల సుభాష్, దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మలపల్లి సర్పంచు కూరపాటి లక్ష్మి టీఆర్ఎస్లో చేరిన విషయం తెల్సిందే. కోతులారం సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు జాజులపారిజాత సత్యనారాయణ గౌడ్ దంపతులు కూడా గులాబీ బాటపట్టారు. వీరితోపాటు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, మండలస్థాయి నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు.
ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్ పనితీరు నచ్చక మూడేండ్లుగా జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూ వచ్చాయి. ఉపఎన్నిక వేళ కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, మండలస్థాయి నాయకులూ గులాబీ బాట పట్టారు. నియోజకవర్గంలో ఆరుగురు జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఐదుగురు జడ్పీటీసీలు, ఐదుగురు ఎంపీపీలు టీఆర్ఎస్ వారే. 159 పంచాయతీలు, 71 ఎంపీటీసీ లు, 30 మంది కౌన్సిలర్లలో 60 శాతానికి పైనే టీఆర్ఎస్లో ఉన్నారు. దీనికితోడు 15 రోజుల్లోనే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది సర్పంచ్లు, 25 మందికిపైగా ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మండల స్థాయి నేతలు టీఆర్ఎస్లో చేరారు.