వర్షాకాలం.. వ్యాధుల వ్యాప్తికి అనువైన కాలం. అపరిశుభ్రతతోపాటు గుంతల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది రోగాలు ముసురుకుంటాయి. అయితే, ‘పల్లెప్రగతి’తో ఇప్పటికే గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయి. పారిశుద్ధ్యం మెరుగు పడింది. పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన వాతావరణమూ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ సీజనల్ వ్యాధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది. రోగాలు వ్యాప్తి చెందకుండా పల్లెపల్లెనా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. జ్వర సర్వే నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నది. మరోవైపు, ఉమ్మడి జిల్లాలోని 1,056 గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు సాగుతున్నాయి. ఇప్పటికే విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుంతల్లో నీరు నిల్వకుండా వాటిని పూడ్చి వేస్తున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయడంతో పాటు నిల్వ ఉన్న నీటిలో ఆయిల్బాల్స్ను వేస్తున్నారు. గతంలో వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో అనారోగ్యంతో బాధపడేవారు. దవాఖానలన్నీ రోగులతో కిటకిటలాడేవి. అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో సీజనల్ వ్యాధుల వ్యాప్తికి కళ్లెం పడింది.
నిజామాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె ప్రగతి కార్యక్రమాల మూలంగా ఇప్పటికే గ్రామాలన్నీ సర్వాంగ సుందరంగా ఉన్నాయి. వానకాలంలో వర్షపు నీరు భారీగా నిలిచి గుంతలు, మురికి కుంటల్లో దోమల సంతతి వృద్ధి చెందే వీలుంది. దీంతో ఆయా రకాల రోగాల బారిన ప్రజలు పడే అవకాశాలు నెలకొన్నాయి. సీజనల్ వ్యాధుల ముప్పు నుంచి ప్రజలను రక్షించాలంటే క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆవాసాలను తొలగించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నడుం కట్టింది. ఊరూరా నిరంతర పారిశుద్ధ్య చర్యలను చేపట్టడం ద్వారా ప్రజలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. శిథిల భవనాలు, పాడుబడ్డ బావులను వేల సంఖ్యలో ఇప్పటికే పూడ్చివేశారు. అయినప్పటికీ అక్కడక్కడా వెలుగు చూసిన వాటిని యజమానుల సమ్మతితో పూడ్చేస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో గ్రామ పంచాయతీ పాలకవర్గాలను భాగస్వామ్యం చేస్తున్నారు. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచులను పెద్ద ఎత్తున రంగంలోకి దించి అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతుండడం విశేషం. ఇదిలా ఉండగా వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దవాఖానల్లో సాయంకాలం ఓపీని అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు దవాఖానల దోపిడీ నుంచి ప్రజలను రక్షిస్తున్నది. గడిచిన 10 రోజుల్లోనే ప్రభుత్వ దవాఖానల్లో 11వేల మంది ఓపీ సేవలను వినియోగించుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
అడుగడుగునా అప్రమత్తం..
వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో పక్కాగా పారిశుద్ధ్య పనులు చేపట్టేలా పంచాయతీరాజ్ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు నివేదికను అందజేయాల్సి ఉంది. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రాలు, ఇతర పారిశుద్ధ్య సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా స్థానిక అధికారులు ఇప్పటికే సామగ్రి అందుబాటులో ఉంచుకోవడంతోపాటు అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లుతూ దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1056 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి జీపీకి జనాభాను అనుసరించి జూనియర్, సీనియర్ సెక్రటరీలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులకు అనువైన సమయం కావడంతో కలెక్టర్ల అనుమతి లేకుండా జిల్లా పరిధి దాటి వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా కలెక్టర్లు చెప్పే వరకు కాకుండా డీపీవోలు శాఖాపరమైన విధులు నిర్వర్తించాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల విధులను ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీ చేయడంతోపాటు వారి పని తీరును పరిశీలించాలని పేర్కొన్నది.
రోజువారీగా శానిటైజేషన్ నివేదికలు..
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలకం. విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా గతంలో ఏడు గంటలకే గ్రామ పంచాయతీల్లో ఉండాలని, హాజరైన వెంటనే రోజూ శానిటైజేషన్ రిపోర్ట్లో నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పంచాయతీ కార్యదర్శుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. స్పందించిన ఉన్నతాధికారులు ఉదయం 7నుంచి 10గంటల వరకు ఎప్పుడైనా రిపోర్ట్ చేసేలా సడలించింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరిగే అవకాశం ఉండడంతో తాజాగా మళ్లీ ఉదయం 7గంటలకే హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను పాటించకుంటే చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్యాధికారులతో కలిసి జ్వర సర్వే చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. డెంగీ, డయేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. రోజూ స్థానిక డీపీవోలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి పారిశుద్ధ్య వివరాలు తెలుసుకోవాలన్నారు.
డీఎల్పీవోల నిర్లక్ష్యం..
ఉమ్మడి జిల్లాలో కొంత మంది డివిజినల్ స్థాయి పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారుల పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జూనియర్, సీనియిర్ పంచాయతీ సెక్రటరీలు విధిగా సమయానికి విధులకు హాజరవుతున్నారు. కానీ పైస్థాయి అధికారులు మాత్రం నిర్లక్ష్యపు బాటను వీడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్, మండల స్థాయి పంచాయతీ అధికారులు స్థానికంగా ఉండకపోవడంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. పంచాయతీ సెక్రటరీల విధులను తనిఖీ చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయగా తూతూ మంత్రంగానే తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్య చర్యలు ఉదయమే జరుగుతుంటాయి. తనిఖీలు మాత్రం మధ్యాహ్నం వేళలో నిర్వహిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్వచ్ఛత కార్యక్రమాలను బాధ్యతగా పర్యవేక్షించాల్సిన అధికారులు మరింత శ్రద్ధ పెడితే ప్రభుత్వ సంకల్పం నెరవేరే అవకాశం ఉంది. కింది స్థాయి సిబ్బంది మాత్రం శ్రమటోడ్చి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తుండగా కొందరు అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం విమర్శలకు తావిస్తున్నది.
ప్రత్యేక కార్యాచరణ అమలు
ప్రస్తుతం వ్యాధులు వ్యాప్తి చెందే ఆస్కారం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. సీజనల్ వ్యాధులు విజృంభించే తరుణం ఆసన్నం కావడంతో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలి. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు చేస్తాం. గ్రామాలు అపరిశుభ్రంగా కనిపిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం. ఎప్పటికప్పుడు మురుగు కాల్వలు శుభ్రం చేయడంతోపాటు మురుగు నిలిచే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లించాలి.
– జయసుధ, డీపీవో, నిజామాబాద్