సూర్యాపేట : మునగాల గొప్ప చరిత్ర గల ప్రాంతం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు కుర్రా జితేంద్రబాబు తండ్రి రామచంద్రమూర్తి సంతాప సభకు మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ముందుగా రామచంద్రమూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..గతంలో తెలంగాణ చరిత్రను పరిశోధన చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంతం గొప్పతనం తెలిసిందన్నారు.
తెలంగాణ చరిత్ర పరిశోధన చేసే సందర్భంలో తాను మునగాలలో దివంగత రామచంద్రమూర్తి కుటుంబంతో కలిసి ఉన్నాని ఆమె పేర్కొన్నారు. అప్పుడు జితేంద్ర బాబు బృందం ప్రొఫెసర్ శివ కుమార్, శివనాగిరెడ్డి నాకు తెలంగాణ ఆవశ్యకత, ఉద్యమాల గురించి వివరించి ధైర్యాన్ని నింపారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం, ఈ ఇల్లు గొప్ప పాత్ర పోషించాయని కవిత తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి, పశు గణాంక అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, పీవోడబ్ల్యూ రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్లు, సినీ డైరెక్టర్ నర్సింగరావు, సూదిని పద్మనాభరెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, జలగం సుధీర్, రైతు కమిటీ మండల అధ్యక్షుడు సుంకర రాజకుమార్, మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, సర్పంచ్ చింతకాయల ఉపేందర్, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.