ముంబై : సాధారణంగా కరోనా రోగులను ఆటోను ఎక్కించుకునేందుకు ఆటో డ్రైవర్లు భయపడుతుంటారు. కానీ ఆయన మాత్రం కరోనా పేషెంట్లను ఉచితంగా తీసుకెళ్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు ఆటో డ్రైవర్గా మారిన ఓ ఉపాధ్యాయుడు. ముంబైకి చెందిన దత్తాత్రేయ సావంత్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రోగులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. నిత్యం పీపీఈ కిట్ ధరించి.. ఎప్పటికప్పుడు ఆటోను శుభ్రం చేస్తూ.. కొవిడ్ కేంద్రాలకు.. గృహాలకు రోగులను తరలిస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ముంబైలో భారీగా పెరుగుతోంది. చాలా మంది చికిత్స అందక మరణిస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో పేద రోగులకు సకాలంలో సహాయం లభిస్తుందో? లేదో?.. ప్రైవేటు అంబులెన్స్ల్లో ధరలు అందుబాటులో ఉండవని భావించి.. ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపాడు. కొవిడ్ రోగులను కేర్ సెంటర్లకు.. దవాఖానలకు ఉచితంగా తీసుకు వెళ్తున్నానని.. డిశ్చార్జి అయిన రోజున తిరిగి ఇండ్లకు తీసుకువస్తున్నానని చెప్పాడు. ముంబై సబర్బన్ ఘాట్కోపర్కు చెందిన దత్తాత్రేయ సావంత్ స్థానిక ధ్యాన్సాగర్ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు లేకపోవడంతో ఆటో డ్రైవర్గా మారి.. గత కొద్ది రోజులుగా ఈశాన్య ముంబైలో కరోనా బాధితులకు ఉచిత సేవలందిస్తున్నాడు. ఇప్పటి వరకు 26 మంది రోగులను ఉచిత రవాణా సౌకర్యం కల్పించానని, కరోనా ఉధృతి కొనసాగినంత కాలం సేవలందిస్తానని తెలిపాడు. కొవిడ్ బాధితులకు ఉచిత సేవలందిస్తున్న దత్తాత్రేయ సావంత్ను స్థానికులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయకు ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. ఆటోకు అవసరమైన ఇంధన ఖర్చులు భరిస్తామని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించడం విశేషం.