ముంబై: ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరిగిపోయి దేశం మొత్తం ఆక్సిజన్ కొరత ఎంతలా వేధిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముంబైకి చెందిన షానవజ్ షేక్ అనే ఓ వ్యక్తి తన కారు అమ్మి ఆ డబ్బులతో ప్రారంభించిన ఉచిత ఆక్సిజన్ సరఫరా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోంది.
ఎవరీ షానవాజ్?
ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో యూనిటీ & డిగ్నిటీ ఫౌండేషన్ నడుతున్నాడు ఈ షానవాజ్ షేక్. గతేడాది కరోనా మహమ్మారి దేశంలో విజృంభించిన తర్వాత తన దగ్గర ఉన్న ఫోర్డ్ ఎండీవర్ ఎస్యూవీ కారు అమ్మి ఆ డబ్బుతో ఓ ఆక్సిజన్ సరఫరా స్కీమ్ను ప్రారంభించాడు. అతడు చేసి ఈ పనికి సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. ఇలా గతేడాది మొత్తం 5 వేల నుంచి 6 వేల మంది తాను ఆక్సిజన్ సరఫరా చేసినట్లు షానవాజ్ చెప్పాడు. ఈసారి కొరత ఎక్కువగా ఉంది. కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో గతంలో రోజుకు మాకు 50 కాల్స్ మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మాత్రం 500 నుంచి 600 కాల్స్ వస్తున్నాయి అని షానవాజ్ చెప్పాడు.
స్నేహితురాలి మరణంతో..
గతేడాది కరోనా సమయంలో తన స్నేహితురాలు ఆక్సిజన్ అందక చనిపోయింది. సమయానికి ఆక్సిజన్ అంది ఉంటే ఆమె బతికి ఉండేది కదా అన్న ఆలోచనే అతన్ని ఈ ఉచిత ఆక్సిజన్ సరఫరా వైపు అడుగులు వేయించింది. వెంటనే కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్, మందులు ఉచితంగా సరఫరా చేయడానికి తన దగ్గర ఉన్న కారును అమ్మేశాడు.
గతంలో మాకు ఎక్కువగా విరాళాలు వచ్చేవి కావు. దీంతో కారు పోతే మళ్లీ కొనుక్కోవచ్చన్న ఉద్దేశంతో దానిని అమ్మేశాను అని షానవాజ్ చెప్పాడు. కారుతో పాటు కొన్ని ఇతర వస్తువులు అమ్మితే వచ్చిన డబ్బులతోనే ఇప్పుడు పది మందికీ సాయం చేస్తున్నాను అని అన్నాడు. ఆక్సిజన్ కొరతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నంలో ఉంటే.. షానవాజ్లాంటి వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు.