ముంబై : ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఈ నెల 15వ తేదీ నుంచి లోకల్ రైళ్లను ప్రారంభించనున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాకే ప్రకటించారు. అయితే, టీకాలు తీసుకున్న వారికే రైళ్లలో అనుమతించనున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముంబైలో ఏప్రిల్ సాధారణ ప్రయాణికుల సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే అనుమిస్తున్నారు. ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు తప్పనిసరిగా రెండో మోతాదు తీసుకున్న వారికే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ మేరకు యాప్ రూపొందించగా.. సోమవారం విడుదల చేయనున్నారు. యాప్లో అర్హత ఉన్న వారి టీకా వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లు లేని వారి కోసం.. స్థానిక మున్సిపల్ వార్డు కార్యాలయాలు, సబర్బన్ రైల్వే స్టేషన్లలో పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇవాళ కొవిడ్ టాస్క్ఫోర్స్ సమావేశం జరుగనుండగా.. మాల్స్, రెస్టారెంట్లతో పాటు పలు సడలింపులు ఇవ్వనున్నట్లు థాక్రే తెలిపారు. కరోనా భద్రతా నియమాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెకండ్ వేవ్ నుంచి ఇంకా పూర్తిగా భయటపడలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం ఉందని హెచ్చరించారు.