‘వీలైతే మైదానానికి వెళ్లి మరీ ముంబైకి మద్దతు తెలుపుతాం’ అని బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బహిరంగంగా ప్రకటిస్తే.. ఎరుపు రంగు పక్కన పెట్టిన ఆర్సీబీ యాజమాన్యం లోగోకు నీలి రంగు అద్ది రోహిత్ సేనకు తమ సపోర్ట్ తెలిపింది. బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై తప్పక గెలువాల్సిన పరిస్థితిలో.. ఆర్సీబీ అభిమానులంతా రోహిత్ గ్యాంగ్కు మద్దతుగా నిలువగా.. ఢిల్లీ నిరాశగా ఇంటిబాట పట్టింది!
పేలవ బ్యాటింగ్తో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఢిల్లీ.. ఆ తర్వాత ఫీల్డింగ్లో నిరాశ పరిచింది. కీలక సమయంలో రివ్యూ తీసుకోవడంలో విఫలమైన రిషబ్ పంత్.. టీమ్కు ఇన్స్టాంట్ విలన్గా మారగా.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకున్న ముంబై.. పోతూ పోతూ ఢిల్లీని తమతో పట్టుకుపోయింది.
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ ముగియక ముందే ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఖరారయ్యాయి. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ఢిల్లీ తడబడటంతో బెంగళూరు ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్ మంగళవారం జరుగనున్న తొలి క్వాలిఫయర్లో తలపడనుండగా.. బుధవారం ఎలిమినేటర్లో లక్నో సూపర్ జెయింట్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. హోరాహోరీగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది.
శనివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రావ్మన్ పావెల్ (34 బంతుల్లో 43; ఒక ఫోర్, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, రమణ్దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 2) తీవ్రంగా నిరాశ పరచగా.. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రేవిస్ (33 బంతుల్లో 37; ఒక ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.