ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ములుగు మండలం మల్లంపల్లి గ్రామం వద్ద గల 163 జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. నల్లబెల్లి మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొండయ్య తన తల్లితో కలిసి ద్విచక్రవాహనంపై హనుమకొండకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కొండయ్య (49) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి తల్లి తీవ్రంగా గాయపడింది.
ఇదే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. తిరుగు ప్రయాణంలో హనుమకొండకు వెళుతుండగా రోడ్డు ప్రమాద సంఘటన స్థలం వద్ద ఆగారు. క్షతగాత్రులను 108 ద్వారా వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.