అభివృద్ధిలో ఆదర్శం
అద్దంలా సీసీ రోడ్లు, వీధిలైట్లు
ఆకట్టుకుంటున్న రాశి, నక్షత్ర వనం
ప్రత్యేక ఆకర్షణగా శివుడి విగ్రహం
రూ.20లక్షలతో కొత్త జీపీ భవన నిర్మాణం
దుగ్గొండి, మార్చి 25: ‘పల్లె ప్రగతి’ స్ఫూర్తితో వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని శివాజీనగర్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామస్తులకు మౌలిక వసతులతో పాటు సదుపాయాలను కల్పించడంలో జీపీ ముందుంటున్నది. రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ.20 లక్షలతో పంచాయతీ కొత్త భవనం ఏర్పాటు చేయగా, విద్యుద్దీపాల కోసం రూ.1.50లక్షలు వెచ్చించారు. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేసి పారిశుధ్య పనుల కోసం వినియోగిస్తున్నారు.
ఏటా రూ.3.80లక్షల మంజూరు..
గ్రామానికి 14వ, 15వ ఆర్థిక సంఘాల ద్వారా ప్రతి నెలా రూ.40వేల చొప్పున ఏటా రూ.4లక్షల 80వేలు నిధులు సమకూరుతున్నాయి. గ్రామానికి పన్నుల రూపంలో సంవత్సరానికి రూ.60వేల ఆదాయం వస్తున్నది. ఈ నిధులను గ్రామాభివృద్ధికి కేటాయిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు, జీపీ సిబ్బందికి నెలనెలా జీతాలు అందిస్తూ పారిశుధ్య పనులు పక్కాగా చేపడుతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఆకట్టుకుంటున్న పల్లె పార్కు
గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. పార్కులో వివిధ రకాల పూల మొక్కలు నాటడంతో పాటు నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్లు, సేద తీరేందుకు బెంచీలు వేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించేలా పార్కు మధ్యలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులోనే రాశి, నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కు మండల కేంద్రానికి వెళ్లే వారిని అమితంగా ఆకట్టుకుంటున్నది. రోజూ ఉదయం, సాయంత్రం పిల్లలు, పెద్దలు పార్కులో సందడి చేస్తుండగా అక్కడి పచ్చని వాతావరణం ఆహ్లాదం పంచుతున్నది. గ్రామస్తులే గాక చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా పల్లె పార్కుకు తరలివస్తుండడం విశేషం. పల్లె ప్రకృతి వనంతో గ్రామానికి కొత్తందం వచ్చిందని గ్రామస్తులు సంబురపడుతున్నారు.